ప్రత్యేక హోదాపై మంత్రాంగం: తెర వెనక ఏమిటి?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశాలు దాదాపుగా సన్నగిల్లినట్లేనని భావిస్తున్నారు. ఈ స్థితిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులతో టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడి కచ్చితమైన మార్గనిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలపడడానికి బిజెపి పెద్ద యెత్తే వేసినట్లు భావిస్తున్నారు. ఈ స్థితిలో చంద్రబాబు రంగంలోకి దిగి బిజెపిపై ఒత్తిడి పెంచినట్లు చెబుతున్నారు.
చంద్రబాబు దాదాపుగా బిజెపికి హెచ్చరికలు చేశారు. దీంతో బిజెపి వెనక్కి తగ్గి బుజ్జగించే వైఖరి తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కడంతో, దాని వల్ల తమకే నష్టం జరుగుతుందని బిజెపి భావించడంతో కేంద్ర మంత్రులు తెర మీదికి వచ్చినట్లు చెబుతున్నారు. ప్రతిపక్షాలు ఆందోళనలకు దిగడంతో టిడిపి పార్లమెంటు సభ్యులు కేంద్ర మంత్రులను కలిశారు.
తాము నేరుగా ప్రత్యేక హోదా ఇవ్వలేమని, దాని బదులు అంతకంటే మెరుగైన ప్రయోజనాలుండే ప్రత్యేక ప్యాకేజి ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఇదే విషయాన్ని విశాఖపట్నం బిజెపి పార్లమెంటు సభ్యుడు హరిబాబు కూడా చెప్పారు. ప్రత్యేక హోదా వల్ల ఏడాదికి రూ.2-3 వేల కోట్లకు మించి ప్రయోజనం దక్కదని, తాము ప్రతిపాదిస్తున్న ప్రత్యేక ప్యాకేజి వల్ల అంతకంటే మెరుగైన ప్రయోజనం ఉంటుందన్నదనేది వారి వాదన.
కేవలం ప్యాకేజి అంటే సరి పోదని, అందులో ఏముందో తొలుత తమతో చర్చించి తమకు అంగీకారమైతేనే ప్రకటించాలని టీడీపీ నేతలు సూచించారు. హోదా బదులు ప్యాకేజివైపే కేంద్రం మొగ్గు చూపిస్తోందని స్పష్టమైన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దానిపై దృష్టి సారించారు. ఈ ప్యాకేజి ఎలా ఉండాలని కోరుకొంటున్నామో నిర్దిష్టంగా కేంద్రానికి తెలపాలని, దీనిపై చర్చించడానికి గురువారం పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత విజయవాడ రావాలని ఆయన కేంద్ర మంత్రి సుజనా చౌదరిని ఆదేశించారు.
మన ప్రతిపాదనలు మనం ఇద్దామని, వారు ఏం ఇస్తారో చూద్దామని, ఆ తర్వాత మన కార్యాచరణను రూపొందించుకుందామని, ఏదైనా మనతో మాట్లాడిన తర్వాతనే కేంద్రం దాన్ని ప్రకటించాలని, ఆ దిశగా ముందుకు సాగాలని బుధవారం ఉదయం టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు సుజనా చౌదరికి సూచించారు. ఈ ప్యాకేజిలో పారిశ్రామిక రాయితీలతో పాటు మూడు అంశాలు కచ్చితంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టేవారికి ఆకర్షణీయ రాయితీలు, పన్ను మినహాయింపులు ఇవ్వాలని, పదేళ్లు లేదా ఐదేళ్ల పాటు ఏపీకి ఇచ్చే కేంద్ర పథకాలు, విదేశీ రుణాల్లో తొంభై శాతం గ్రాంటుగా ఇవ్వాలని, ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ఆర్థిక సహాయం ఈ ప్యాకేజిలో ఉండాలన్నది ఏపీ ప్రతిపాదన.
అయితే, వాటిలోని కొన్ని అంశాలపై కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. అయినప్పటికీ కేంద్రంలో కదలిక తేగలిగామని, ఈ వేడిని తగ్గించవద్దని చంద్రబాబు సుజనాతో చెప్పినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకేసారి ఇవ్వడానికి బదులు ఏడాదికి ఒకటి చొప్పున ఇస్తే ప్రజలు గుర్తుంచుకొంటారని కొందరు వాదించారు. దానివల్ల మనం బలపడవచ్చునని వారు భావించారు.
అన్నీ ఒకేసారి ఇస్తే చంద్రబాబు మరింత బలపడతారని, బీజేపీ ఎదిగే అవకాశం రాదని కొందరు రాష్ట్ర నేతలు వారి వద్దకు వచ్చి చెబుతూ వచ్చారని అంటారు. వీటన్నింటి మధ్యా ఇవన్నీ పెండింగ్లో పడిపోయాయి. ప్రస్తుతం బీజేపీ నేతల్లో స్పష్టత వచ్చినట్లు కనిపిస్తోంది. ఇవ్వకపోతే తాము ఎక్కువ నష్టపోతామని వారికి అర్ధమైంది. దీంతో ఈ నెలాఖరులోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ ప్యాకేజీ ఇవ్వడానికి కేంద్రం సంసిద్ధమైనట్లు తెలుస్తోంది.