హోదాపై డెడ్లైన్తో హెచ్చరిక, నేనూ వస్తా: చంద్రబాబు
విశాఖ/విజయవాడ: ఈ నెల 10వ తేదీలోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై ప్రకటన రాకుంటే రాష్ట్ర బంద్కు పిలుపునిస్తామని సిపిఐ నేత రామకృష్ణ ఆదివారం నాడు హెచ్చరించారు. ప్రత్యేక హోదా సాధనా సమితి బస్సు యాత్ర ఆదివారం విశాఖ చేరుకుంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, విశాఖ ఎంపీ హరిబాబు ప్రజలను ఇంకా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రం చెబుతుంటే, తమకు నమ్మకం ఉందంటూ ప్రజలను ఏమార్చే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీకి కేంద్రం సాయం తప్పనిసరి అని, ఇది ఘర్షణకు దిగాల్సిన సమయం కాదని ఏపీ సీఎం చంద్రబాబు శనివారం పార్టీ నేతలతో వ్యాఖ్యానించారని సమాచారం. ఘర్షణ అవసరం లేదని, అదే సమయంలో మనకు రావాల్సిన వాటిని వదిలి పెట్టవద్దని, వాటి కోసం మన ప్రయత్నం కొనసాగుతూ ఉండాలని ఎంపీలకు బాబు సూచించారు.
ప్రత్యేక హోదా ఎవరికీ ఇవ్వడం లేదని కేంద్ర మంత్రి పార్లమెంటులో ప్రకటన చేసిన నేపథ్యంలో టిడిపి పార్లమెంటరీ పక్షం అనుసరించాల్సిన వైఖరి ఎలా ఉండాలన్న దానిపై సమావేశంలో చర్చకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇష్టం లేకుండా రాష్ట్ర విభజన జరిగిందని, రాజధాని లేదని, ఆర్థిక వనరులు లేవని, ఈ దైన్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకొనే ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటులో ఆనాడు ప్రకటించారని గుర్తు చేశారు.
మిగతా రాష్ట్రాల్లోని పరిస్థితి, ఏపీ పరిస్థితి వేరన్నారు. ఈ విషయాన్నే మనం పదేపదే కేంద్రంలోని పెద్దలకు చెబుతూ వస్తున్నామని, వారి ఇబ్బందులు వారికి ఉండొచ్చని, కానీ మన ఇబ్బందులు చాలా తీవ్రమైనవని, ఆర్థికంగా వెసులుబాటు లేకుండా, పెట్టుబడులు రాకుండా మనం పొరుగు రాష్ట్రాలతో పోటీపడే పరిస్ధితి లేదన్నారు.
మీరు కూడా ఇవే విషయాలు కేంద్రంలోని పెద్దలకు వివరిస్తూ ఉండాలని, ప్రశ్నలు వేయాలని, సమాధానం రాబట్టాలని ఎంపీలకు సూచించారు. రోజూ మంత్రులను కలవాలన్నారు. నేను కూడా వస్తానని చెప్పారు. అందరం కలిసి ఉమ్మడిగా మన వంతు ప్రయత్నం చేద్దామని చంద్రబాబు ఎంపీలకు చెప్పారు.
మనం చిత్తశుద్ధితో పని చేస్తే ప్రజలు మన శ్రమను గుర్తిస్తారని, దానిని మీరు మర్చిపోవద్దని, అదే సమయంలో కేంద్రం నుంచి సహకారం తీసుకోవటం తప్ప మనకు మరోమార్గం లేదని, అన్ని విషయాల్లోనూ కేంద్రం సహకారం తీసుకునే ముందుకు వెళ్లవలసి ఉంటుందని చంద్రబాబు చెప్పారు. తలోమాటా మాట్లాడి మిత్ర బంధానికి విఘాతం కలిగించే పరిస్థితి తీసుకురావద్దన్నారు.
ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామని ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ చేసిన ప్రకటన ప్రస్తావనకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ రోజు ఈ ఖర్మ పట్టడానికి కారణమే కాంగ్రెస్ అని, గుండెల్లో పొడిచి ఇప్పుడు సానుభూతి చూపిస్తే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు.