Aadhaar:ఎన్నారైలకు గుడ్ న్యూస్ - ఇక నిరీక్షణ అవసరం లేదు : ఒక ఫోన్ లేదా మెయిల్తో క్లియర్..!!
ఎన్నారైలకు ఆధార్ కార్డు జారీకి సంబంధించి కీలక నిర్ణయం వెలువడింది. గతంలో మాదిరిగా ఇక ఆధార్ కార్డుల కోసం ఎన్నారైలు నిరీక్షించాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఆధార్ కార్డు కోసం 182 రోజులు ఎదురుచూడాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు ఎన్నారైలకు వెంటనే ఆధార్ కోసం దరఖాస్తు చేసుకునే వీలు కల్పించింది యూఐడీఏఐ(యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా). స్వదేశానికి వచ్చిన వెంటనే ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
దీనికి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కోసం ఇండియన్ పాస్పోర్టు తప్పనిసరి అని పేర్కొంది. ఈ నేపథ్యంలో యూఐడీఏఐ గురువారం ఓ ట్వీట్ చేసింది. ఎన్నారైలు ఇకపై ఆధార్ దరఖాస్తు కోసం 182 రోజులు వేచి చూడాల్సిన అవసరం లేదు. చెల్లుబాటయ్యే భారతీయ పాస్పోర్టు ఉన్న ప్రవాస భారతీయులు స్వదేశానికి రాగానే దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లాలి. ఇతర వివరాల కోసం 1947 ఫోన్ చేయవచ్చు. లేదా [email protected]కు మెయిల్ చేయండి" అంటూ యూఐడీఏఐ ట్వీట్ చేసింది.

ఇందు కోసం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. మొదట సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లి.. చెల్లుబాటు అయ్యే ఇండియన్ పాస్పోర్టు తీసుకెళ్లడం తప్పనిసరి అని పేర్కొంది. నమోదు దరఖాస్తు ఫారంలో వివరాలు నింపాలి. ఎన్నారైలు ఈ-మెయిల్ ఐడీ ఇవ్వడం తప్పనిసరి. ఇక ప్రవాస భారతీయులకు డిక్లరేషన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కనుక జాగ్రత్తగా చదివిన తర్వాత సంతకం పెట్టాలి. తనను ఎన్నారైగా నమోదు చేయాల్సిందిగా ఆపరేటర్ను ప్రత్యేకంగా అడగాలి. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీగా పాస్ పోర్టు ఇవ్వాల్సి ఉంటుంది.
బయోమెట్రిక్ క్యాప్చర్ ప్రాసెస్ను కూడా జాగ్రత్తగా పూర్తి చేయాలి. కంప్యూటర్ స్ర్కీన్పై మీ వివరాలను తనిఖీ చేసిన తర్వాతే ఆపరేటర్కు దరఖాస్తును సమర్పించడానికి చెప్పాలి. చివరగా 14 అంకెలతో ఉండే దరఖాస్తు స్లిప్ను తీసుకోవడం మరిచిపోకూడదు. ఈ స్లిప్లో దరఖాస్తు ఐడీ, తేదీ, సమయం ఉంటాయి. ఇవి మీ దరఖాస్తు స్టేటస్ను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. దీని ద్వారా ఇక నుంచి ఎన్నారైలకు త్వరిత గతిన ఆధార్ కార్డులు అందుకోవటం సులభతరం కానుంది.












Click it and Unblock the Notifications