కొండకైనా గుట్టకైనా లోన్ ఒకే...నిజమైన రైతన్నలకు మాత్రం నో:ఇదీ బ్యాంకర్ల తీరు

అమరావతి:రాష్ట్రంలో అనేక జిల్లాల్లో అన్నదాతల పట్ల బ్యాంకర్లు వ్యవహరిస్తున్నతీరు అనుమానాలకు తావిస్తోంది. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో నూటికి నూరు శాతం పంట రుణాలు మంజూరు చేసి నిర్ధేశిత లక్ష్యాలను చేరుకోగా, కర్నూలు జిల్లాలో బ్యాంకర్ల పనితీరు విమర్శలకు తావిస్తోంది.

కర్నూలు జిల్లాలో ఇప్పటివరకు పంట రుణాల మంజూరు 60 శాతం మాత్రమే ఉండగా...మంజూరు చేసిన క్రాప్ లోన్స్ కూడా అనుమానాస్పదంగా ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు ఆరోపిస్తున్నారు. దీంతో అసలు మండల వ్యవసాయాధికారులు బ్యాంకులకు వెళ్లకపోవడం వల్లే అనేక అక్రమాలకు ఆస్కారం ఏర్పడుతోందని...మీరు చేసే తప్పులకు జిల్లాకు చెడ్డపేరు వస్తోందని స్వయంగా జిల్లా కలెక్టర్ ఎస్‌.సత్యనారాయణ హెచ్చరించడం పరిస్థితికి అద్దం పడుతోంది.

Farmers Facing Problems To Avail Crop Loans From Banks

కర్నూలు జిల్లా ఎల్‌.కె.తండా పరిధిలోని 451/10 సర్వే నంబరు అంతా కొండలతో నిండి ఉంటుంది. ఈ పరిసర ప్రాంతాలన్నీ సుమారు 1800 ఎకరాల్లో కొండలు, గుట్టలు, చెట్లు, చేమలతో అడవిని తలపిస్తోంది. అయితే వీటికి కూడా పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చేయించుకున్న కొందరు అక్రమార్కులు వాటిని బ్యాంకులో చూపి రుణాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇలా సుమారు 1600 ఎకరాల మేరా పంట రుణాలు తీసుకున్నారని అంటున్నారు.
అలాగే ఓర్వకల్లు మండలంలోని కన్నమడకల, పాలకొల్లు గ్రామాల పరిధిలోనూ బండరాళ్లతో నిండి అధ్వానంగా ఉన్న రాతి నేలలో కనీసం నేల అనేది ఎక్కడా కనిపించని భూములకు కూడా బ్యాంకులు పంట రుణాలు మంజూరు చేసినట్లు సమాచారం. ఇక్కడ సుమారు 300 ఎకరాలకు ఈ విధంగా పంట రుణాలు మంజూరు చేసినట్లు తెలుస్తోంది.

రుణాల మంజూరులో బ్యాంకర్లు నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలు తీసుకొచ్చినవారికి సైతం ముందు ముందు రుణాలు మంజూరు చేస్తూ, నిజమైన అన్నదాతలకు మాత్రం పంట రుణాలు ఇవ్వక పోలుండటంతో పెట్టుబడులు లేక రైతన్నల వ్యవసాయం భారంగా మారుతోంది. అయితే ఇలా అనర్హులకు యధేచ్చగా పంట రుణాలు మంజూరు చేస్తున్నబ్యాంకర్లు బ్యాంకర్లు సన్న, చిన్న కారు రైతులకు రూ.లక్ష కూడా రుణం ఇవ్వడం లేదు. వారంతా కాళ్లరిగేలా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో వడ్డీలకు అప్పులు తెచ్చుకుని పంటలను సాగు చేస్తున్నా కర్షకులకు మాత్రం పంట రుణాలు తీసుకునే అవకాశం లభించడం లేదు.

ఒకవైపు రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలిస్తుండటం, అలాగే రైతులు తీసుకుంటున్న రుణాల్లో వడ్డీకి కూడా రాయితీ ఇవ్వడం చేస్తోంది. అయితే వీటి ఫలాలు నిజమైన రైతన్నలకు అందడం లేదని, అందుకు వ్యవసాయాధికారులు సరైన చొరవ చూపకపోవడమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యవసాయాధికారులతో సమావేశం సందర్భంగా రైతులకు తోడ్పాటు నిచ్చేందుకు మీలో ఎంతమంది బ్యాంకులకు వెళ్తున్నారని జిల్లా కలెక్టర్ ప్రశ్నించగా కనీసం హాజరైనవారిలో పట్టుమని 10 మంది కూడా బదులివ్వలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

మీ నిర్లక్ష్యం కారణంగానే బ్యాంకర్లు నిజమైన రైతులకు కాకుండా నిబంధనలను సైతం తోసిరాజని కొండలు, గుట్టలు, బండరాళ్లు ఉన్న ప్రాంతాలకు అప్పులిచ్చేస్తున్నారని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. వాస్తవానికి వ్యవసాయాధికారులు నిజమైన రైతుల వివరాలతో కూడిన ఒక నివేదిక బ్యాంకర్లకు అందించి రుణాలకు వీరంతా అర్హులని చెప్పాలి...వారికి పంటరుణాలు ఇప్పించాలి. అయితే అది జిల్లాలో ఎక్కడా జరగడం లేదని కలెక్టర్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. కలెక్టర్ హెచ్చరికలతో నైనా వ్యవసాయ అధికారుల వ్యవహారశైలిలో మార్పు వస్తుందేమో వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+