మే లో తిరుమలకు ప్లాన్ చేయండి- మరీ ముఖ్యంగా 2,12 తేదీల్లో
తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శనివారం నాడు 79,878 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 33,037 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.94 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 30 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 నుండి 14 గంటల సమయం పట్టింది.
మే నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలను టీటీడీ వెల్లడించింది. మే 1న కూర్మ జయంతితో ఈ ఉత్సవాలు ఆరంభమౌతాయి. అదే రోజు పవిత్ర పౌర్ణమి. దీన్ని పురస్కరించుకుని సాయంత్రం 7 గంటలకు పౌర్ణమి గరుడసేవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. శ్రీదేవి, భూదేవితో కలిసి శ్రీమలయప్ప స్వామివారు గరుడవాహనారూఢుడై, తిరుమల నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతారు. అశేష భక్తులను కటాక్షిస్తారు.

2న అన్నమాచార్య జయంతి జరుగుతుంది. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యలో తిరుమల, తిరుపతిల్లో సంకీర్తన ఆలాపన కార్యక్రమాలు నిర్వహిస్తారు. 3న పరాశర భట్టర్ వర్ష తిరు నక్షత్రం ఉంటుంది. మే 12న హనుమజ్జయంతి. ఈ సందర్భంగా స్వామివారు హనుమ వాహనంపై ఊరేగుతారు. 21న నమ్మళ్వార్ ఉత్సవం ఆరంభమౌతుంది. 26న వరదరాజస్వామి వర్ష తిరు నక్షత్రం జరుగుతుంది. 30న నమ్మళ్వార్ శాత్తుమొరతో మే నెల ఉత్సవాలు ముగుస్తాయి.
అదే నెలలో తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయం, అనుబంధ ఆలయాలలో విశేష ఉత్సవాలను నిర్వహిస్తుంది టీటీడీ. మే 1, 15, 22, 29వ తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చి ఉత్సవం ఉంటుంది. మే 1న వసంతోత్సవాలలో భాగంగా ఉదయం 9.30 గంటలకు అమ్మవారి స్వర్ణ రథం, 2వ తేదీ అమ్మవారి ఆలయంలో వసంతోత్సవాలు ముగుస్తాయి. 8న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45 నిమిషాలకు ఆలయ మాడ వీధులలో గజ వాహనంపై అమ్మవారు విహరిస్తారు.
శ్రీ సుందరరాజ స్వామి ఆలయంలో..మే 13న ఉత్తర భద్ర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 7 గంటలకు స్వామివారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి అనుగ్రహిస్తారు. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మే 1, 8, 15, 22, 29వ తేదీలలో శుక్రవారం సాయంత్రం 7 గంటలకు వస్త్రలంకారణ సేవ, అభిషేకం జరుగుతుంది.
5న ఉదయం 8 గంటలకు అష్టదళ పాదపద్మారాధన సేవ, 9న శ్రవణా నక్షత్రం సందర్బంగా ఉదయం 10.30 గంటలకు కల్యాణోత్సవం, 13న ఉదయం 8 గంటలకు అష్టోత్తరశత కలశాభిషేకాన్ని నిర్వహిస్తారు. మే 3, 10, 17, 24, 31వ తేదీలలో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి ఉదయం 8.15 నిమిషాలకు అభిషేక సేవ ఉంటుంది.












Click it and Unblock the Notifications