భారత ఆర్మీలో భారీ మార్పులు
దేశ సైనిక వ్యవస్థలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. కీలక నియామకాల ప్రక్రియను కేంద్రం భర్తీ చేసింది. దేశానికి తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) గా రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ ఎన్ ఎస్ రాజా సుబ్రమణి నియమితులయ్యారు. అదే సమయంలో వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ తదుపరి నావికాదళ అధిపతిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రస్తుతం జనరల్ అనిల్ చౌహాన్.. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా వ్యవహరిస్తోన్నారు. ఆయన పదవీకాలం ఈ నెల 30వ తేదీ నాటితో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో తాజా నియామకాలు అవసరం అయ్యాయి. కేంద్రం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ రాజా సుబ్రమణి సీడీఎస్ గా అపాయింట్ అయ్యారు. అలాగే కేంద్ర ప్రభుత్వ మిలిటరీ అఫైర్స్ డిపార్ట్మెంట్కు కార్యదర్శిగా కూడా ఆయన వ్యవహరిస్తారు.

లెఫ్టినెంట్ జనరల్ రాజా సుబ్రమణి గత ఏడాది సెప్టెంబర్ 1 నుండి నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ లో మిలిటరీ అడ్వైజర్ గా సేవలు అందిస్తున్నారు. అంతకుముందు ఆయన 2024 జులై 1 నుండి 2025 జులై 31 వరకు ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్గా పనిచేశారు. అలాగే 2023 మార్చి నుండి 2024 జూన్ వరకు సెంట్రల్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా పని చేశారు. సీడీఎస్ తో పాటు నౌకాదళ చీఫ్ నియామకం కూడా పూర్తయింది.
వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ తదుపరి నౌకాదళాధిపతిగా బాధ్యతలను స్వీకరిస్తారు. ప్రస్తుతం ఆయన ముంబైలో వెస్ట్రన్ నేవల్ కమాండర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నెల 31వ తేదీన తదుపరి నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయన పదవీకాలం 2028 డిసెంబర్ 31 వరకు కొనసాగే అవకాశం ఉంది.
వైస్ అడ్మిరల్ స్వామినాథన్ 1987 జులై 1న నావికాదళంలో చేరారు. కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్లో ఆయన నిపుణుడు. ఖడక్వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ, యూకేలోని ష్రివన్హామ్లో జాయింట్ సర్వీసెస్ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజీ, కరంజాలోని కాలేజ్ ఆఫ్ నేవల్ వార్ఫేర్ అండ్ రోడ్ ఐలాండ్లోని న్యూపోర్ట్లోని యునైటెడ్ స్టేట్స్ నేవల్ వార్ కాలేజీల్లో చదువుకున్నారు. కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ పై ఆయనకు మంచి పట్టు ఉంది.












Click it and Unblock the Notifications