హెచ్-1 బీ వీసా ఫ్రాడ్ కేసు.. ఇద్దరు తెలుగువాళ్లకు 5 ఏళ్లు జైలు, 2 కోట్ల జరిమానా..??
అగ్రరాజ్యం అమెరికా వెళ్లాలి అనేది చాలామంది భారతీయుల కల. అమెరికాలో మాస్టర్స్ చేసి ఉద్యోగం సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. భారత్ నుంచి ఏటా లక్షల మంది అమెరికాకు వెళ్తుంటారు. ఉద్యోగం సంపాదించి ఇల్లు కొనుక్కొని అక్కడే సెటిల్ అవ్వాలనేది వారి కల. అమెరికా నుంచి భారత్ కు వెళ్లేవారి సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం అమెరికాలో భారతీయుల సంఖ్య దాదాపు 52 లక్షలకు పైగానే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల్లో భారత్ నుంచి వెళ్లిన వారే అత్యధికం కావడం విశేషం. అగ్రరాజ్యంలో భారతీయ విద్యార్థుల సంఖ్య సుమారు 3.3 లక్షలుగా ఉంది.
అయితే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత విదేశాల నుంచి అమెరికాకు వచ్చే విద్యార్థులు, ఉద్యోగులపై కఠిన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. వీసాల జారీ విషయంలోనూ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. అయితే పలు కారణాలతో హెచ్-1బీ వీసాలు దుర్వినియోగం అవుతున్నట్లు స్పష్టం అవుతోంది. తాజాగా హెచ్-1బీ వీసాల పేరిట జరిగిన ఫ్రాడ్ కేసులో అమెరికాలోని ఇద్దరు తెలుగు వ్యక్తులు తమ నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. కాలిఫోర్నియాలోని డబ్లిన్ నగరానికి చెందిన సంపత్ రాజీదీ, శ్రీధర్ మాడ ఈ ఫ్రాడ్ కేసులో భాగం అయినట్లు అమెరికా అటార్నీ కార్యాలయం వెల్లడించింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సంపత్ రాజీదీ అమెరికాలో రెండు వీసా ప్రాసెసింగ్ కంపెనీలను నడుపుతున్నారు. అయితే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఉద్యోగాలు ఉన్నాయని ఫేక్ సర్టిఫికెట్స్ సృష్టించి విదేశీయులకు హెచ్-1బీ వీసాల కోసం దరఖాస్తు చేశారు. అలాగే శ్రీధర్ మాడ.. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో అగ్రికల్చర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ విభాగంలో చీఫ్ ఇన్ఫర్మేషనల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. అభ్యర్థులు యూనివర్సిటీ ప్రాజెక్టుల్లో పని చేస్తారని ఫేక్ పత్రాలు అందించారు.
అయితే సాధారణంగా హెచ్-1బీ వీసా పొందాలంటే అమెరికాలోని ఏదైనా ఒక సంస్థలో సదరు నిపుణుడికి ఉద్యోగం కచ్చితంగా ఉండాలి. దీన్ని ఆసరాగా చేసుకున్న శ్రీధర్ మాడ.. తనకున్న అధికారంతో యూనివర్సిటీలో ఉద్యోగాలు ఉన్నట్లు నకిలీ ధృవీకరణ పత్రాలను సృష్టించారు. ఈ విషయాలు విచారణలో తేలినట్లు అమెరికా అటార్నీ కార్యాలయం పేర్కొంది.

ఇక జూన్ 2020 నుంచి జనవరి 2023 మధ్య ఈ ఫేక్ దందాను కొనసాగించినట్లు విచారణలో వ్యక్తం అయింది. ప్రస్తుతం నిందితులిద్దరూ తమ నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. అయితే అమెరికా చట్టాల ప్రకారం.. వీరికి గరిష్టంగా 5 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాంతోపాటు దాదాపు 2.5 లక్షల డాలర్ల (సుమారు రూ. 2 కోట్లు) భారీ జరిమానా విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఈ కేసులో తుది తీర్పును కాలిఫోర్నియా జిల్లా న్యాయమూర్తి ట్రాయ్ ఎల్ నన్లీ జూలై 30, 2026న వెల్లడించనున్నారు.












Click it and Unblock the Notifications