గుడ్ న్యూస్: హార్మూజ్ దాటిన భారత నౌక.. 46 వేల మెట్రిక్ టన్నుల LPGతో..
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. భారత్ లోనూ గ్యాస్, చమురు సరఫరా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యుద్ధం కారణంగా ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయగా ఉన్న హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ఇప్పుడు ఆ జలసంధిపై అమెరికా దిగ్బంధనం కొనసాగుతోంది. ఈ తరుణంలో భారత్ కు గుడ్ న్యూస్. భారత్ కు చెందిన 'సర్వ్ శక్తి' నౌక తాజాగా హార్మూజ్ జలసంధిని దాటినట్లు తెలుస్తోంది. ఈ నౌక దాదాపు 46 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీని మోసుకొస్తోంది. ఈ నౌకలో ఎల్పీజీతోపాటుగా భారత సిబ్బంది కూడా ఉన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నౌక తన ఆటోమెటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ద్వారా ఇండియా క్రూ అని సందేశాన్ని పంపించింది.
ఇక 'సర్వ్ శక్తి' నౌక ప్రస్తుతం లారక్ ఐలాండ్ ను దాటి ఒమన్ గల్ఫ్ వైపు ప్రయాణిస్తోంది. ఇరాన్- అమెరికా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ సూచించిన సురక్షిత మార్గంలోనే ఈ నౌక ప్రయాణిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. ఈ నౌకలో దాదాపు 46,313 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ ఉన్నట్లు సమాచారం. ఈ నౌక మే 13 తేదీ నాటికి విశాఖ తీరానికి చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇరాన్- అమెరికా మధ్య చర్చలు విఫలం కావడంతో హార్మూజ్ పై అమెరికా దిగ్బంధనం విధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత భారత్ కు చేరుకుంటున్న తొలి ఎల్పీజీ నౌక ఇదే కావడం విశేషం. ఇక ఈ నౌకలో మొత్తం 20 మంది సిబ్బంది ఉండగా.. వారిలో 18 మంది భారతీయులని తెలుస్తోంది.

ఇక అంతర్జాతీయ మీడియా సంస్థ అయిన బ్లూమ్ బర్గ్ కథనం ప్రకారం.. భారత్ లోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ సరుకును కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని కంపెనీ ఇప్పటి వరకు ధృవీకరించలేదు. మరోవైపు ప్రస్తుతం భారత్ లో గ్యాస్ సంక్షోభం ఉన్న నేపథ్యంలో ఈ నౌక భారత్ కు చేరుకుంటే ఎల్పీజీ సరఫరాలో కాస్త ఉపశమనం లభించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications