IIT: ఐఐటీల్లో ఊహించని మార్పు.. సీఎస్ఈని వదిలి ఆ బ్రాంచ్ కు విద్యార్దుల పరుగు..!
ఐఐటీ ప్రవేశాల్లో గత దశాబ్ద కాలంగా కంప్యూటర్ సైన్స్ (CSE) మాత్రమే హాట్ కేక్గా నిలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ ట్రెండ్లో ఓ ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విస్తరణతో సాఫ్ట్వేర్ రంగంలో వస్తున్న శరవేగ మార్పులు, మరోవైపు దేశంలో వేగంగా సాగుతున్న మౌలిక వసతుల కల్పన వల్ల సివిల్ ఇంజినీరింగ్కు మళ్లీ ప్రాధాన్యత పెరుగుతోంది. నేటి తరం విద్యార్థులు కేవలం తక్షణ ప్యాకేజీల కంటే దీర్ఘకాలిక కెరీర్ భద్రతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఐఐటీల్లో తాజా ట్రెండ్ (IIT)
తాజా జోసా (JoSAA) కౌన్సిలింగ్ తొలి రౌండ్ గణాంకాలు ఈ మార్పును స్పష్టం చేస్తున్నాయి. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఐఐటీ బాంబేలో సివిల్ ఇంజనీరింగ్ ఓపెనింగ్ ర్యాంక్ గతంలో 2,666 ఉండగా, ఈసారి ఏకంగా 385కి చేరింది. అలాగే ఐఐటీ ఢిల్లీలో సివిల్ ఓపెనింగ్ ర్యాంక్ 3,030 నుంచి 179కి ఎగబాకింది. టాప్ 100 ర్యాంకర్లు ఇప్పటికీ సీఎస్ఈ వైపే మొగ్గు చూపుతున్నప్పటికీ, ఆ తర్వాతి స్థానాల్లో ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులు మాత్రం సివిల్ వైపు స్థిరంగా అడుగులు వేస్తున్నారు.

సాఫ్ట్వేర్ అనిశ్చితి.. సివిల్కు పెరుగుతున్న క్రేజ్
గతంలో ఐఐటీ సాధించి సివిల్ ఇంజినీరింగ్లో చేరడం కంటే, కొత్త ఐఐటీలలో సీఎస్ఈ పొందడానికే విద్యార్థులు ఆసక్తి చూపేవారు. కానీ ఇప్పుడు జనరేటివ్ ఏఐ ప్రభావంతో ఎంట్రీ లెవల్ కోడింగ్ ఉద్యోగాల భద్రతపై కొత్త సందేహాలు వస్తున్నాయి. ఈ తరుణంలో భారతదేశంలో ఎక్స్ప్రెస్వేలు, మెట్రో రైళ్ళు, స్మార్ట్ సిటీలు మరియు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు వంటి భారీ మౌలిక సదుపాయాల నిర్మాణాలు వేగవంతం కావడం వల్ల సివిల్ ఇంజినీరింగ్ కోర్సులకు దీర్ఘకాలిక డిమాండ్ ఏర్పడుతోంది.
సివిల్ ఎందుకంటే ?
ప్రస్తుత తరుణంలో సివిల్ ఇంజినీరింగ్ రంగం కేవలం నిర్మాణాలకే పరిమితం కాలేదు. ఐఐటీలలో నూతన విద్యావిధానం ప్రకారం ఇందులో మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, రిమోట్ సెన్సింగ్ లాంటి అధునాతన సాంకేతికతలను జోడించారు. విద్యార్థులు స్మార్ట్ మొబిలిటీ, క్లైమేట్ రెసిలెంట్ వంటి అత్యాధునిక అంశాలను నేర్చుకుంటున్నారు. దీనివల్ల సాంప్రదాయ రంగాలు ఆధునిక సాంకేతిక శక్తితో నూతన రూపం సంతరించుకుని కొత్త ఉపాధి మార్గాలను సృష్టిస్తున్నాయి.

జీతాల కంటే కెరీర్ కే ప్రాాధాన్యం
విద్యార్థుల ఆలోచనలు కేవలం ప్రారంభ జీతాల పరిమితుల నుంచి బయటపడి సుదీర్ఘ కెరీర్ స్థిరత్వం వైపు మళ్లుతున్నాయి. రాబోయే 2040 నాటికి దేశ ఆర్థిక ప్రగతిలో కీలక భాగస్వామ్యం వహించడానికి ఈ కోర్సులు ఎంతో ఉపయోగపడతాయని వారు విశ్వసిస్తున్నారు. కేవలం కోడింగ్ కంటే ప్రాజెక్టుల నిర్మాణంలో నేరుగా పాల్గొనడమే ఉత్తమ మార్గమని భావిస్తూ ఐఐటీ ప్రతిభావంతులు సివిల్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిణామం రాబోయే రోజుల్లో సరికొత్త విద్యా విప్లవానికి నాంది కానుంది.














Click it and Unblock the Notifications