పెళ్లి కాని యువతకు ఇండియన్ నేవీ గోల్డెన్ ఛాన్స్.. భారీ జీతంతో జాబ్స్ !!
దేశ సేవ చేయాలనే లక్ష్యంతో పాటు టెక్నాలజీ రంగంలో కెరీర్ నిర్మించుకోవాలనుకునే యువతకు ఇండియన్ నేవీ శుభవార్త ప్రకటించింది. షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ద్వారా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. 2027 జనవరిలో కేరళలోని ప్రతిష్టాత్మక ఇండియన్ నేవల్ అకాడమీ (INA), ఎజిమలలో ప్రారంభమయ్యే కోర్సుకు సంబంధించి ఈ నియామకాలు చేపడుతున్నారు. మొత్తం 15 ఖాళీలను భర్తీ చేయనుండగా, అవివాహిత పురుషులు, మహిళలు ఇద్దరూ ఇందుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎవరు అర్హులు?
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి లేదా ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ సబ్జెక్టులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే కంప్యూటర్ లేదా ఐటీ సంబంధిత విద్యార్హతలు తప్పనిసరి. బీసీఏ, బీఎస్సీ పూర్తి చేసి ఎంసీఏలో కనీసం 60 శాతం మార్కులు సాధించిన వారు అర్హులు. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, సాఫ్ట్వేర్ సిస్టమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి విభాగాల్లో బీఈ, బీటెక్, ఎంఎస్సీ లేదా ఎంటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేయవచ్చు. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు కూడా అవకాశం కల్పించడం విశేషం.

వయోపరిమితి..
అభ్యర్థులు జనవరి 1, 2002 నుంచి జూలై 1, 2007 మధ్య జన్మించి ఉండాలి. శారీరకంగా దృఢంగా ఉండటంతో పాటు మెడికల్ ప్రమాణాలు కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. నేవీలో చేరే వారికి క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సాంకేతిక నైపుణ్యాలు కీలకంగా పరిగణిస్తారు.
ఎంపిక విధానం..
ఈ నియామక ప్రక్రియలో ప్రత్యేక రాత పరీక్ష నిర్వహించరు. అభ్యర్థుల విద్యార్హతలు, మార్కుల ఆధారంగా మొదట షార్ట్లిస్ట్ చేస్తారు. అనంతరం ఎంపికైన వారికి ఎస్ఎస్బీ (SSB) ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఈ ఇంటర్వ్యూలో వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, మానసిక స్థైర్యం వంటి అంశాలను పరీక్షిస్తారు.
ఇంటర్వ్యూలో విజయం సాధించిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టులు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు నేవీలో అధికారులుగా సేవలందించే అవకాశం పొందుతారు.
జీతభత్యాలు..
ఎంపికైన వారికి నెలకు రూ.56,100 ప్రారంభ వేతనం లభిస్తుంది. దీనికి అదనంగా డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రావెల్ సౌకర్యాలు, మెడికల్ సదుపాయాలు, క్యాంటీన్ ప్రయోజనాలు వంటి అనేక బెనిఫిట్స్ ఉంటాయి. విదేశీ శిక్షణలు, ఆధునిక టెక్నాలజీలపై పని చేసే అవకాశం కూడా లభిస్తుంది.
శిక్షణ ఎలా ఉంటుంది?
ఎంపికైన అభ్యర్థులకు కేరళలోని ఎజిమలలో ఆరు వారాలపాటు కఠినమైన శిక్షణ ఇస్తారు. ఈ సమయంలో ఫిజికల్ ట్రైనింగ్, మిలిటరీ క్రమశిక్షణ, ఐటీ సిస్టమ్స్, సైబర్ సెక్యూరిటీ, నేవల్ కమ్యూనికేషన్ టెక్నాలజీలపై ప్రత్యేక శిక్షణ అందిస్తారు. శిక్షణ సమయంలో వివాహం చేసుకోవడం నిషేధం. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే అభ్యర్థిత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉంటుంది.
ఎన్సీసీ అభ్యర్థులకు ప్రత్యేక ప్రాధాన్యం..
ఎన్సీసీ 'సి' సర్టిఫికేట్ లేదా కనీసం 'బీ' గ్రేడ్ ఉన్న అభ్యర్థులకు కటాఫ్ మార్కుల్లో 5 శాతం వెయిటేజ్ ఇవ్వనున్నారు. దీంతో ఎన్సీసీ క్యాడెట్లకు ఎంపికలో అదనపు ప్రయోజనం లభించనుంది.
సర్వీస్ కాలం ?
ఎంపికైన అధికారులకు ప్రారంభంలో 10 సంవత్సరాల సర్వీస్ ఉంటుంది. నేవీ అవసరాలు మరియు అభ్యర్థి పనితీరు ఆధారంగా మరో నాలుగేళ్లు పొడిగించే అవకాశం ఉంటుంది. ప్రతిభ కనబరిస్తే భవిష్యత్తులో ఉన్నత హోదాలకు ఎదిగే అవకాశాలు కూడా ఉన్నాయి.
దరఖాస్తు ఎలా చేయాలి?
ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 1, 2026లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మే 16 నుంచి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు అధికారిక ఇండియన్ నేవీ వెబ్సైట్లో పూర్తి వివరాలు పరిశీలించి అప్లై చేయాలని అధికారులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications