తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ వాయిదాకు హైకోర్టు నిరాకరణ: ఆ రోజే పరీక్ష
హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష యథాతథంగా జరగనుంది. ఎందుకంటే, గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదాకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ సోమవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా రద్దయిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జూన్ 11న జరగనున్న విషయం తెలిసిందే.
ఇది ఇలావుండగా, తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు హాల్ టికెట్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రంలో 503 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీకి జూన్ 11న నిర్వహించతలపెట్టిన ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్ల్ నేటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థుల వివరాల ర్యాండమైజేషన్ తర్వాత వీటిని వెబ్సైట్లో పొందుపరిచింది. ఆదివారం అంటే జూన్ 4 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని టీఎస్పీఎస్సీ సూచించింది. పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకోవాలని.. 15 నిమిషాల ముందే గేట్లు మూసివేయడం జరుగుతుందని పేర్కొంది.

జూన్ 11న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల పరీక్ష జరగనుంది. అక్టోబర్ 16 నాటి పరీక్ష కోసం డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లు ఇప్పుడు పనిచేయవని.. తాజాగా మళ్లీ తీసుకోవాలని కమిషన్ సూచించింది. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై వారం రోజులుగా టీఎస్పీఎస్సీ బోర్డ్ సమాలోచనలు చేసి.. ఈ నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో 503 గ్రూప్-1 సర్వీసుల ఉద్యోగాలకు గత ఏడాది ఏప్రిల్లో కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా 3.8 లక్షల మంది దరఖాస్తు చేశారు. గత అక్టోబర్ 16న జరిగిన ప్రిలిమినరీ పరీక్షను ప్నశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జూన్ 11న నిర్వహించనున్న రెండున్నర నెలల క్రితం ప్రకటించింది. పరీక్ష మరింత పారదర్శకత పెంచేందుకు ఇప్పటికే కమిషన్ పలు చర్యలు తీసుకుంది. పోలీసు కంప్యూటర్ సెల్, ఇతర సైబర్ నిపుణులు, వర్సిటీల ప్రొఫెసర్లతో కూడిన కమిటీలు చేసిన సిఫార్సుల మేరకు కమిషన్లోని సైబర్ సెక్యూరిటీ వ్యవస్థను పటిష్టం చేసింది. మరిన్ని ఫైర్వాల్స్ ఉపయోగించింది.
యూపీఎస్సీ సిఫార్సుల మేరకు పరీక్షల నిర్వహణకు ప్రత్యేకంగా కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ పోస్టును సృష్టించింది. పరీక్షల విభాగం అంతా ఆ అధికారి నేతృత్వంలో నడుస్తుంది. యూపీఎస్సీ సిఫార్సుల మేరకు రాష్ట్రేతర స్థానికత కలిగిన ఐఏఎస్ అధికారి నియామకం చేప్టటింది. ఇక ప్రిలిమినరీ పరీక్షలో పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు టీఎస్ పీఎస్సీ అభ్యర్థులను రెండంచెల్లో తనిఖీ చేయనుంది. మెటల్ డిటెక్టర్లు, ఇతర పద్ధతుల్లో అభ్యర్థుల్ని రెండుసార్లు, రెండు బృందాలు పూర్తిగా పరిశీలించిన తర్వాతే పరీక్ష కేంద్రంలోనికి అనుమతిస్తారు. గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించింది.
తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి












Click it and Unblock the Notifications