తెలంగాణ ఇంటర్ ఫలితాలు అప్పుడే!
తెలంగాణలో కూడా ఇంటర్మీడియట్ ఫలితాలు త్వరలోనే విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఫలితాలు తాజాగా, విడుదలైన నేపథ్యంలో తెలంగాణలో ఇంటర్ పరీక్షా ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయా అని ఇటు తల్లిదండ్రులు, అటు విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కాగా, తెలంగాణలో ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి.
ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,521 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసి.. పకడ్బందీగా పరీక్షలను నిర్వహించారు. మూల్యాంకన ప్రక్రియను మార్చి 10 నుంచి ప్రారంభించారు. మొత్తం 4 విడతల్లో ఈ ప్రక్రియను నిర్వహించారు. ఏప్రిల్ 10వ తేదీన పూర్తి చేశారు.

మార్కుల నమోదుతోపాటు ఎలాంటి సాంకేతికపరమైన ఇబ్బందులూ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో.. ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకున్న తర్వాత ఫలితాలను వెల్లడించనున్నారు. అయితే, ఒకేసారి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెంకండ్ ఇయర్ రిజల్ట్స్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
అన్ని ముందస్తు కార్యక్రమాలు పూర్తి చేసుకొని.. ఏప్రిల్ 20వ తేదీ తర్వాత పరీక్షా ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఏప్రిల్ 21 లేదా 22 తేదీలలో ఇంటర్ ఫలితాలు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
కాగా, ఏపీలో ఇంటర్ ఫలితాలు శుక్రవారం రోజున విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 67 శాతం, సెకండ్ ఇయర్లో 78 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్ సౌరబ్గౌర్, పరీక్షల కంట్రోలర్ సుబ్బారావు ప్రకటించారు. ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఫలితాల్లో బాలికలు 71 శాతం, బాలురు 64 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్లో ఫలితాల్లో బాలికలు 81 శాతం, బాలురు 75 శాతం ఉత్తీర్ణత పొందారు.












Click it and Unblock the Notifications