తెలంగాణలో పోలీసు పరీక్షల తేదీలు ఖరారు
హైదరాబాద్: తెలంగాణలో ఉద్యోగాల నియామకాల కోసం వరుసగా నోటిఫికేషన్లు వెలువడుతున్న విషయం తెలిసిందే. తాజాగా, రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ తుది పరీక్ష తేదీలను తెలంగాణ పోలీసు నియామక మండలి ప్రకటించింది. సివిల్, ట్రాన్స్ పోర్ట్, ఎక్సైజ్, ఫింగర్ ప్రింట్ పోస్టులకు విడివిడిగా పరీక్ష తేదీలను ప్రకటించింది.
ప్రస్తుతం జరుగుతున్న దేహధారుడ్య పరీక్షలు జనవరి 5తో ముగియనుండటంతో మార్చి 12 నుంచి ఏప్రిల్ 23 వరకు అన్ని తుది పరీక్షలను పూర్తి చేసేందుకు పోలీసు నియామక మండలి సిద్ధమైంది. ఎస్సై తుది పరీక్షలో మొత్తం నాలుగు పేపర్లు ఉండగా.. ఏప్రిల్ 8న సివిల్, ఐటీ, ట్రాన్స్ పోర్టు ఎస్సై, ఫింగర్ ప్రింట్ విభాగం ఏఎస్సై అభ్యర్థులకు మొదటి రెండు పేపర్ల పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అర్థమెటిక్, రీజనింగ్ పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఇంగ్లీష్ పరీక్ష జరగనుంది.

ఇక ఏప్రిల్ 9న ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకూ కేవలం సివిల్ ఎస్సైలకు మూడో పేపర్ జనరల్ స్టడీస్ పరీక్ష, మధ్యాహ్నం తెలుగు లేదా ఉర్దూ పరీక్ష ఉంటుంది. ఎస్సై తుది పరీక్షలకు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
ఏప్రిల్ 23 నుంచి ఒంటి గంట వరకూ సివిల్, ట్రాన్స్ పోర్టు, ఎక్సైజ్ కానిస్టేబుల్ అభ్యర్థులకు జనరల్ స్టడీస్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు 10 జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసు నియామక మండలి ప్రకటించింది. ఏప్రిల్ 23న మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఐటీ అండ్ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అభ్యర్థులకు టెక్నికల్ పరీక్ష నిర్వహిస్తారు.
మార్చి 12న ఉదయం ఐటీ అండ్ కమ్యూనికేషన్ ఎస్సై అభ్యర్థులకు టెక్నికల్ పరీక్ష, మధ్యాహ్నం ఫింగర్ ప్రింట్ ఏఎస్సై అభ్యర్థులకు టెక్నికల్ పరీక్ష జరగనుంది. మార్చి 26న ఉదయం ఎస్సై ట్రాన్స్పోర్ట్ టెక్నికల్ పేపర్ పరీక్ష, ఏప్రిల్ 2న ఉదయం డ్రైవర్ కానిస్టేబుల్ పోస్టులకు టెక్నికల్ పరీక్ష నిర్వహించనున్నారు. ఏప్రిల్ 2న మధ్యాహ్నం.. కానిస్టేబుల్ మెకానిక్ అభ్యర్థులకు టెక్నికల్ పేపర్ పరీక్ష జరగనుంది. ఈ పరీక్షలను కేవలం హైదబాద్లోనే నిర్వహించనున్నట్లు రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. మిగితా వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.












Click it and Unblock the Notifications