నా బిడ్డ చావుకు సీఎం విజయే కారణం: కన్నీరు మున్నీరైన ప్రముఖ నటి!
తమిళనాడు రాజకీయాల్లోనూ, సినీ వర్గాల్లోనూ తీవ్ర సంచలనం రేకెత్తించే ఓ విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రముఖ నటి జూలీ సంచలన ఆరోపణలు చేశారు. తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు విజయ్కు చెందిన 'తమిళగ వెట్రి కజగం'పార్టీ మద్దతుదారులు సోషల్ మీడియాలో తనపై చేసిన దారుణమైన ట్రోలింగ్ కారణంగానే తనకు అబార్షన్ అయిందని ఆమె బహిరంగంగా ఆరోపించారు. ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయంగా, సామాజికంగా పెద్ద దుమారాన్నే రేపుతోంది.
నటి జూలీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది మార్చి నెలలోనే ఆమె చెన్నై పోలీసులను ఆశ్రయించి 8 మందిపై ఫిర్యాదు చేశారు. వీరంతా టీవీకే పార్టీకి చెందిన మద్దతుదారులుగా ఆమె పేర్కొన్నారు. అయితే ఈ ఫిర్యాదు తర్వాత పోలీసుల నుంచి ఆమెకు ఓ నోటీసు వచ్చింది. అందులో ఈ వ్యవహారం క్రిమినల్ పరిధిలోకి రాదని, కేవలం వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే అంశంగా మాత్రమే పరిగణిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ నోటీసు జారీ అయిందని.. దీని గురించిన సమాచారం తనకు ముందే తెలియదని జూలీ తెలిపారు.

తనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ అంతటితో ఆగలేదని జూలీ ఆవేదన వ్యక్తం చేశారు. ఏకంగా రూ.15 లక్షల విలువైన కిడ్నీ స్కామ్లో తనకు ప్రమేయం ఉందంటూ ఓ కల్పిత కథనాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారని మండిపడ్డారు. ఏదో సినిమా స్క్రీన్ప్లే, డైరెక్షన్ తరహాలో పక్కా ప్లాన్తో తనపై దుష్ప్రచారం చేశారని జూలీ చెప్పుకొచ్చారు. ఇటీవలే వివాహం చేసుకున్న జూలీ.. ఈ నిరంతర మానసిక వేధింపుల కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆ ఒత్తిడి భరించలేక ఆమె గర్భంలోని మొదటి బిడ్డ కనుమూసింది. అయితే తానూ ఈ విషాదాన్ని కేవలం సానుభూతి కోసమే చెప్పడం లేదని, తనతో పాటు తన భర్త ప్రతిష్టను దెబ్బతీయడానికే ఇలా చేస్తున్నారని ఆమె స్పష్టం చేశారు. ఏ మహిళ అయినా టీవీకే పార్టీ విధానాలపై ప్రశ్నిస్తే వారిని దారుణంగా టార్గెట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే జూలీ నేరుగా ముఖ్యమంత్రి విజయ్పై విమర్శలు గుప్పించారు. తన బిడ్డ మరణానికి సీఎం విజయే నైతికంగా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. విజయ్ తన మద్దతుదారులను ఒక్కసారి వారించి ఉన్నా.. ఈ రోజు తనకు ఈ గతి పట్టేది కాదని కన్నీటిపర్యంతమయ్యారు. "కేవలం ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా పుణ్యమా" అని ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన ఒక నేత.. ఇలా ప్రత్యర్థులపై దాడులు చేయించడం కాకుండా ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.
We Lost Our baby கண்ணீர் விட்டு அழுத Juliee#CMVijay #juliee #indiaglitztamil pic.twitter.com/wgU4C4byWx
— IndiaGlitz - Tamil (@igtamil) May 30, 2026
ఈ ప్రెస్ మీట్ సందర్భంగా ఒక జర్నలిస్ట్ జోక్యం చేసుకుంటూ.. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిన సమయంలో తమిళనాడులో డీఎంకేప్రభుత్వం ఉందని గుర్తు చేశారు. ఎందుకంటే ఏప్రిల్లో జరిగిన ఎన్నికల తర్వాత మే నెలలోనే విజయ్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. దీనిపై స్పందించిన జూలీ.. తాను పాత ప్రభుత్వం ఉన్నప్పుడు ఫిర్యాదు చేసిన మాట వాస్తవమే అయినా, ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం బాధ్యత తీసుకుని తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సీఎం విజయ్ అభిమానులు, పార్టీ శ్రేణులు ఎలా స్పందిస్తాయో చూడాలి.














Click it and Unblock the Notifications