"ఢీ" షో డాన్స్ మాస్టర్ పండుకి రోడ్డు ప్రమాదం.. రెండు కాళ్లకు తీవ్రగాయాలు !!
ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో "ఢీ" ఫేమ్ డ్యాన్స్ మాస్టర్ పండు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున విశాఖపట్నం జిల్లా ఆనందపురం సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముఖ్యంగా ఆయన రెండు కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
కాగా సమాచారం ప్రకారం.. పండు మాస్టర్ మంగళవారం తగరపువలస సమీపంలో జరిగిన ఓ జాతర కార్యక్రమంలో ప్రత్యేక డ్యాన్స్ ఈవెంట్కు హాజరయ్యారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసిన అనంతరం తన డ్యాన్స్ బృందంతో కలిసి కారులో హైదరాబాద్కు బయలుదేరారు. అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత ఆనందపురం సమీపంలోకి రాగానే కారులో ఉన్న ఓ డ్యాన్సర్కు అకస్మాత్తుగా అస్వస్థత ఏర్పడి వాంతులు కావడంతో వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపివేశారు. పరిస్థితిని పరిశీలించేందుకు పండు మాస్టర్తో పాటు మరికొందరు బృంద సభ్యులు కారు దిగినట్లు తెలుస్తోంది.

అయితే అదే సమయంలో వెనుక నుంచి అత్యంత వేగంగా వస్తున్న కోళ్ల లోడుతో ఉన్న బొలెరో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న కారును బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి పండు మాస్టర్ కిందపడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. అంతేకాకుండా ఆయన ప్రయాణిస్తున్న కారు పూర్తిగా ధ్వంసమవగా, దాని ముందు నిలిపి ఉన్న మరో బొలెరో వాహనం కూడా దెబ్బతిన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న స్థానికులు, సహచరులు ఆయనను రక్షించి సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నంలోని ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
ప్రమాద వార్త బయటకు రావడంతో పండు మాస్టర్ అభిమానులు, సినీ పరిశ్రమకు చెందిన పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. 'ఢీ' డ్యాన్స్ షో ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువైన పండు మాస్టర్కు ప్రమాదం జరగడం పట్ల పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
పోలీసులు దర్యాప్తు
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించి కేసు నమోదు చేశారు. బొలెరో డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమా? లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రమాద సమయంలో వాహనాల వేగం, రహదారి పరిస్థితులు, డ్రైవర్ పరిస్థితిపై కూడా పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు వాహనాలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.












Click it and Unblock the Notifications