పక్కవాళ్ల పనుల్లో వేలు పెట్టకూడదు: అగ్నికి ఆజ్యం పోసిన కొరటాల
కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన పాన్ ఇండియా చిత్రం దేవర. ఈనెల 27వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. తెలుగు, తమిళం, మళయాళం, కన్నడం, హిందీ భాషల్లో విడుదలవుతోంది. ఈ సినిమాపై దర్శకుడు కొరటాల ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత ఎన్టీఆర్ అభిమానులు దేవర గురించి అడగ్గా చిత్రం విజయోత్సవ వేడుకలో కలుద్దామని చెప్పారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ల పనిలో హీరో, దర్శకుడు బిజీగా ఉన్నారు.
ఎవరి పనిని వారు చేసుకోనివ్వాలి
తాజాగా తెలుగు యువ హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్.. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివతో ఇంటర్వ్యూ చేశారు. ప్రస్తుతం ఇది ప్రసారమవడంతోపాటు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాస్తవానికి కొరటాల శివ మొదటి నుంచి చాలా జాగ్రత్తగా, ఆచితూచి మాట్లాడుతుంటారు. అనవసరమైన వ్యాఖ్యలు కూడా ఏవీ చేయరు. ఆచార్య సినిమా విషయంలో చిరంజీవి పరోక్షంగా కొరటాల గురించి కొన్ని కొన్ని సందర్భాల్లో కామెంట్లు చేసినా ఆయన స్పందించలేదు. తాజాగా ఈ ఇంటర్వ్యూలో కొరటాల శివ మాట్లాడుతూ ఎవరు చేసే పనిని వారు ప్రశాంతంగా చేసుకోనివ్వాలని, అప్పుడే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుందన్నారు. అవసరం లేకపోయినా ఇబ్బంది పెట్టడం, మన పనిని మనం చేయనివ్వకుండా అడ్డుపడటం, తామే బాధ్యత తీసుకోవడం లాంటివన్నీ కష్టమన్నారు.

అనవసరంగా జోక్యం చేసుకున్న చిరు
ప్రస్తుతం ఇవి వైరల్ గా మారాయి. ఆచార్య సినిమా షూటింగ్ సమయంలో అనవసరంగా చిరంజీవి జోక్యం చేసుకున్నారని, మధ్యలో వేలు పెట్టారని, అవసరం లేకపోయినా రామ్ చరణ్ పాత్రను పొడిగించారంటూ వార్తలు వచ్చాయి. సినిమా ఫ్లాపైంది. దీనికి దర్శకుడు కొరటాల శివదే తప్పని చిరంజీవి పరోక్షంగా చాలా సందర్భాల్లో అన్నారు. ఇప్పుడు కొరటాల చేసిన వ్యాఖ్యలు చిరంజీవినుద్దేశించే అంటూ సోషల్ మీడియాలో చిరంజీవి అభిమానులకు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు యుద్ధం నడుస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే రెండు వర్గాలు తీవ్రస్థాయిలో కామెంట్లు పెడుతున్నాయి. మరి అభిమానుల యుద్ధం దేవర సినిమాకు లాభం చేకూరుస్తుందా? నష్టం చేస్తుందా? అనేది తేలాలంటే సినిమా విడుదలయ్యేవరకు ఆగక తప్పదు.












Click it and Unblock the Notifications