ఆ ముగ్గురు హీరోల సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా: రాజమౌళి
దర్శక ధీరుడు రాజమౌళి నుంచి సినిమా వస్తోందంటే భారతదేశం ఒక్కటే కాదు.. ప్రపంచం మొత్తం ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. రూ.1500 కోట్ల బడ్జెట్ తో మహేష్ బాబు హీరోగా ఆయన రూపొందిస్తున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. తాజాగా ఆయన జపాన్ లో పర్యటిస్తున్నారు. మరోవైపు హీరో మహేష్ బాబు ఇటలీలో పర్యటిస్తున్నారు. సినిమా నాణ్యత విషయంలో రాజమౌళి ఎక్కడా రాజీపడటంలేదు. జపాన్ లో పర్యటిస్తున్న ఈ దర్శక ధీరుణ్ని మీడియా, అభిమానులు చుట్టుముట్టారు. తాను తీసిన ఆర్ఆర్ఆర్ సినిమా డాక్యుమెంటరీ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతోందని, మొత్తం సినిమా తీయడానికి మూడు సంవత్సరాలు పట్టిందన్నారు.
మొత్తం ఫుటేజ్ 20 టీబీ ఉంది
సినిమా ఫుటేజ్ వీడియో మొత్తం 20 టీబీ ఉందని, వీటిలో కొన్ని ముఖ్యమైన పాయింట్లను కలిపి వీడియోగా తయారుచేశామన్నారు. మీకు ఎటువంటి సినిమాలంటే ఆసక్తి కలుగుతుంది? రాబోయే సినిమాల్లో వేటి కోసం మీరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు? అని మీడియా ప్రశ్నించింది. దీనికి రాజమౌళి సమాధానమిస్తూ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ సినిమా కోసం, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ చిత్రం కోసం, బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది చిత్రం కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు రాజమౌళి వెల్లడించారు. ఈ సినిమాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో కూడా బాగా ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి తెలిసిందే.

అన్ని విషయాలు గోప్యంగా ఉంచుతున్న రాజమౌళి
రాజమౌళి తన సినిమా షూటింగ్ ప్రారంభం నుంచి అన్ని విషయాలను గోప్యంగా ఉంచుతున్నారు. ప్రియాంకచోప్రా హీరోయిన్ గా నటిస్తోందా? లేదంటే విలన్ గా నటిస్తోందా? అనే విషయంలో స్పష్టత లేదు. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర ఏమిటనే విషయం కూడా తెలియదు. ఇటీవలే ఒడిసాలో షూటింగ్ పూర్తిచేసుకోగా, త్వరలోనే విదేశాల్లో చిత్రీకరణ జరుపుకోనుంది. అడవుల్లో యాక్షన అడ్వెంచర్ గా రాజమౌళి ఈ సినిమా తీస్తున్నారు. దీనికి కథ విజయేంద్రప్రసాద్ అందించగా, డైలాగులను దర్శకుడు దేవా కట్టా రాస్తున్నారు. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్.నారాయణ దీన్ని నిర్మిస్తున్నారు.












Click it and Unblock the Notifications