సినిమాలకు సెన్సార్.. ప్రేక్షకులను పూర్తిగా అవమానించడమే: ఆర్జీవీ
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా సెన్సార్షిప్ గురించి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సినిమాలకు సెన్సార్ విధించడం అనేది ప్రేక్షకులను తీవ్రంగా అవమానించడమేనని.. ఈ సెన్సార్ విధానాన్ని పూర్తిగా నిషేధించాలని ఆర్టీవీ డిమాండ్ చేశారు. ఆర్జీవీ తన ఎక్స్ ఖాతా వేదికగా సెన్సార్ షిప్ గురించి సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. స్మార్ట్ ఫోన్లు, గ్లోబల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్లు, అనంతమైన సమాచారం అందుబాటులో ఉన్న నేటి డిజిటల్ యుగంలో ఓ కమిటీ వయోజనులైన ప్రేక్షకులను సినిమా నుంచి కాపాడుతుందని భావించడం ఓ మూర్ఖత్వం అవుతుందని ఆర్జీవీ అన్నారు. అసలు ఆ కమిటీ సభ్యలు అర్హతలేంటో ఎవరికీ తెలియదన్నారు. ఓ చిత్ర నిర్మాత తన కోణం నుంచి చూపించాలనుకునే సత్యాన్ని ప్రేక్షకులు చూడకుండా అడ్డుకోవాలనుకోవడం నిజంగా విడ్డూరమన్నారు.
ఇక్కడ ప్రభుత్వాల ద్వంద్వ విధానాన్ని, కపటత్వాన్ని మనం గమనించాలని ఆర్జీవీ పేర్కొన్నారు. దేశ భవిష్యత్తును మార్చే నాయకుడిని ఎన్నుకునేందుకు, కుటుంబాలను నడిపేందుకు, వ్యాపారాలు సాగించేందుకు దేశంలోని ప్రజలకు సంపూర్ణ అర్హత ఉందని భావించే ప్రభుత్వం.. వారు ఏ సినిమా చూడాలో తేల్చుకునే హక్కు వారికి లేదని అనుకోవడం ఎంతవరకు సమంజసమని ఆర్జీవీ ప్రశ్నించారు. ఓ వైపు వందల కోట్ల మంది భవిష్యత్తును నిర్దేశించే ఓటు హక్కును వారికి నమ్మి ఇస్తూనే.. మరోవైపు ఓ సినిమా సీన్ వారిని పాడుచేస్తుందని భయపడటం ఏమిటంటూ ఆర్జీవీ ప్రశ్నించారు.

ఇది సమాజాన్ని రక్షించడం కాదని.. వయోజనులను ఇంకా చిన్న పిల్లల్లాగే చూస్తూ అవమానించే ప్రయత్నమని మండిపడ్డారు. 18 ఏళ్ల యువకుడు దేశ పాలకుడిని ఎంచుకోగలడు కానీ.. సినిమాలో ఓ బూతు మాట వింటేనో లేదా ఓ సీన్ చూస్తేనో చెడిపోతాడని భావించి.. ఎవరో కమిటీ సభ్యుడు ఆ సీన్ ను కట్ చేయడం నిజంగా నవ్వులాట అంటూ రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు. థియేటర్లలో విడుదలయ్యే సినిమాల్లో సీన్లు కట్ చేయడం ఇప్పుడు పూర్తిగా చెత్త పని అంటూ ఆర్జీవీ మండిపడ్డారు. సెన్సార్ పూర్తిగా విఫలమైందంటూ ఆర్జీవీ ఓ ఉదాహరణతో సహా వివరించారు. థియేటర్లలో కట్ చేసిన అన్ కట్ వెర్షన్ కొద్ది గంటల్లోనే టోరెంట్స్, టెలిగ్రామ్స్ లేదా అంతర్జాతీయ ప్లాట్ఫారమ్లలో ప్రత్యక్షమవుతుందని ఆర్జీవీ చెప్పుకొచ్చారు. ఉదాహరణకు 'అబ్సెషన్' సినిమాలోని తలబాదుకునే సన్నివేశాన్ని సెన్సార్ బోర్డు కట్ చేసిన తర్వాత.. ఆ సీన్ ను థియేటర్లలో చూసిన వారి కంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూసిన వారి సంఖ్య 10 రెట్లు ఎక్కువగా ఉందని ఆర్జీవీ తెలిపారు. ఏఐ యుగంలో నియంత్రణ అనేది ఓ పెద్ద జోక్ అంటూ ఆర్జీవీ పేర్కొన్నారు.
భాష, శృంగారం, హింస లేదా సిద్ధాంతాల పేరుతో బలవంతంగా కట్స్ వేయడం వల్ల సినిమా తన సహజత్వాన్ని కోల్పోయి ఓ నిస్సారమైన ముద్దలా తయారవుతుందన్నారు. ప్రతి రోజూ చిన్న పిల్లలతో సహా అందరూ టీవీల్లో హింసాత్మక వార్తలను, విపరీతాలను చూస్తున్నప్పుడు.. కేవలం సినిమాలోని కొన్ని క్షణాల సృజనాత్మకత మాత్రమే ఎందుకు నిషేధాలకు గురవుతుందో అర్థం కావడం లేదన్నారు. ఈ సెన్సార్ షిప్ విషయంలో సినీ పరిశ్రమలో అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. కళలు, ప్రేక్షకుల గురించి ఏ మాత్రం అవగాహనం లేని నిర్జీవ బ్యూరోక్రసీ ముందు నిర్మాతలు, దర్శకులు మోకరిల్లడం ఆపాలన్నారు. ప్రతిసారి ఇండస్ట్రీ రాజీపడటం, సెన్సార్ కట్లకు ఒప్పుకోవడం లేదా గొడవలు ఎందుకని తమకు తామే సెల్ఫ్ సెన్సార్ చేసుకోవడం వల్లే వారు మరింత రెచ్చిపోతున్నారని ఆర్జీవీ మండిపడ్డారు. దీని వల్ల మొత్తం సినిమా రంగమే బలహీనపడి, ఎవరికైనా సులభమైన లక్ష్యంగా మారుతోందన్నారు.
ప్రస్తుత రూపంలో ఉన్న సెన్సార్ బోర్డు ఉనికిని కోర్టుల్లో సవాలు చేయడానికి సినీ పరిశ్రమ అంతా ఏకం కావాల్సిన సమయం వచ్చిందని ఆర్జీవీ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛాయుత వ్యక్తీకరణ అత్యంత ముఖ్యమన్నారు. ప్రపంచమంతా ఒకదానితో ఒకటి అనుసంధానమైన ఈ కాలంలో.. సినిమాను ఒంటరి చేసి దాని రెక్కలు కత్తిరించడం ఆత్మహత్యాసదృశ్యమని రామ్ గోపాల్ వర్మ ముగించారు.
CENSOR should be BANNED
— Ram Gopal Varma (@RGVzoomin) July 15, 2026
Censoring Films Actually is an INSULT to the AUDIENCES
In an era of smartphones, global streaming, and access to infinite information, to pretend that a government appointed committee (What is the qualification of its members ?) can shield adults from…














Click it and Unblock the Notifications