Guntur Kaaram: ఘాటెక్కించే టికెట్ రేట్: బెనిఫిట్ షో థియేటర్ల లిస్ట్ ఇదే: పర్మిషన్ గ్రాంటెడ్
Guntur kaaram: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం.. గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నెల 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. మహేష్- త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తోన్న మూడో మూవీ ఇది.
హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లు. జగపతి బాబు, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ.. ఇతర కీలక పాత్రలను పోషించారు. థమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ మాస్ మసాలా మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. గుంటూరు సమీపంలోని నంబూరు క్రాస్ రోడ్స్ వద్ద గల భారత్ పెట్రోల్ బంక్ పక్కనే ఉన్న బహిరంగ స్థలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సాయంత్రం 5 గంటలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం ఆరంభమౌతుంది.
విడుదల వేళ గుంటూరు కారం సినిమా నిర్మాతలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. టికెట్ల రేట్లను పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. అలాగే- సినిమా విడుదల రోజైన జనవరి 12వ తేదీన అర్ధరాత్రి దాటిన తరువాత ఒంటిగంటకు బెనిఫిట్ షోను ప్రదర్శించడానికీ పర్మిషన్ జారీ చేసింది.
సింగిల్ స్క్రీన్ థియేటర్లల్లో టికెట్ ఒక్కింటికి 65 రూపాయలు, మల్టీ ప్లెక్స్లల్లో 100 రూపాయలను పెంచుకోవచ్చు. వారం రోజుల పాటు అంటే 12 నుంచి 18వ తేదీ వరకు ఈ పెంచిన టికెట్లు అమలులో ఉంటాయి. అలాగే- ఈ వారం రోజుల పాటు కూడా రోజూ ఆరు ఆటలను ప్రదర్శించుకోవడానికీ అనుమతులు లభించాయి. దీని ప్రకారం చూస్తే- తెల్లవారు జామున 4 గంటలకే మొదటి ఆట మొదలవుతుంది.
బెనిఫిట్ షోను ప్రదర్శించే అవకాశం పరిమితంగా కల్పించింది. నెక్సస్ మాల్- కూకట్పల్లి, ఏఎంబీ సినిమాస్- గచ్చిబౌలి, భ్రమరాంబ థియేటర్- కూకట్పల్లి, మల్లికార్జున థియేటర్- కూకట్పల్లి, అర్జున్ థియేటర్- కూకట్పల్లి, విశ్వనాథ్ థియేటర్- కూకట్పల్లి, గోకుల్- ఎర్రగడ్డ, సుదర్శన్ 35 ఎంఎం- ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ప్రసాద్ మల్టీప్లెక్స్- నెక్లెస్ రోడ్లల్లో అర్ధరాత్రి ఒంటిగంటకు బెనిఫిట్ షో ప్రదర్శించవచ్చు.
రాజధాని డీలక్స్- దిల్షుక్ నగర్, శ్రీప్రేమ థియేటర్- తుక్కుగూడ, ఎస్వీసీ తిరుమల్ థియేటర్- ఖమ్మం, వినోదా థియేటర్- ఖమ్మం, మమతా థియేటర్- కరీంనగర్, నటరాజ్ థియేటర్- నల్లగొండ, ఎస్వీసీ విజయా థియేటర్- నిజామాబాద్, వెంకటేశ్వర థియేటర్- మహబూబ్నగర్, శ్రీనివాస థియేటర్- మహబూబ్ నగర్, రాధిక థియేటర్- వరంగల్, అమృత థియేటర్- హన్మకొండ, ఎస్వీసీ మల్లీప్లెక్స్- గద్వాల్ థియేటర్లలో బెనిఫిట్ షో వేయడానికి అనుమతి ఇస్తూ హోం మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ జితేందర్ ఉత్తర్వులు ఇచ్చారు.












Click it and Unblock the Notifications