6 లక్షలు ఖర్చు చేశా కానీ పవన్ పట్టించుకోలే - షకలక శంకర్
జబర్దస్ట్ ద్వారా బుల్లితెర అభిమానులకు దగ్గరై కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు షకలక శంకర్. ఆ తర్వాత గీతాంజలి, రాజుగారి గది, ఆనందోబ్రహ్మ సహా పలు సినిమాలతో కమెడియన్గా మరింత పేరు సంపాదించుకొని.. హీరోగాను పలు సినిమాల్లో నటించారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు బయట మాత్రమే కాదు.. ఇండస్ట్రీలో కూడా చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. వారిలో శంకర్ కూడా ఒకరని తెలిసిన విషయమే.
ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శంకర్ పవన్ కళ్యాణ్పై అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు. పవన్ మీద అభిమానంతో జనసేన పార్టీ కోసం తన సొంత డబ్బు సైతం ఖర్చు పెట్టానని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. 2019లో సినిమాల్లో నటించినందుకు 7 లక్షలు వచ్చాయని.. అవి తీసుకొని ఇంటికి వెళ్దామనుకునే సమయంలో తుఫాను వచ్చిందని తెలిపారు. ఆ సమయంలోనే పవన్ అక్కడ బాధితులను చూడడానికి వచ్చారని.. ఆయన వెళ్లిపోయాక వారం రోజులకు తాను కూడా అక్కడికి వెళ్లానని గుర్తు చేసుకున్నారు.

దాదాపు రూ.3 లక్షలతో అక్కడ అందరికీ భోజనం ఏర్పాటు చేయించానని.. మిగిలిన డబ్బును ఎన్నికల ప్రచారం కోసం ఖర్చుపెట్టానని శంకర్ వెల్లడించారు. అయితే ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తే ఆ కోపంతో నాలుగు రోజులు తన భార్య మాట్లాడలేదని చెప్పారు. అంత చేసినందుకు పవన్ కళ్యాణ్ కనీసం ఫోన్ చేసి మాట్లాడారా అని తన మామయ్య అడిగారని.. అందుకు సమాధానం చెప్పలేకపోయానని అన్నారు. పవన్ మీద అభిమానంతో చేసినదానికి రివర్స్లో ఏమీ కోరుకోమని.. సినిమాలో నటించినప్పుడు కూడా కనీసం ఫోటో తీసుకోలేదని వెల్లడించారు.
అభిమానం అనేది మనసులో ఉండాలని.. తన మనసులో పవన్ కళ్యాణ్ పై ప్రేమ పర్మనెంట్గా ఉండిపోతుందని శంకర్ చెప్పారు. అంతే కాకుండా రాజకీయాలంటే ఒకరినొకరు తిట్టుకోవడం కాదని ప్రజల కోసం తాము ఏం చేస్తారో చెప్పడమే రాజకీయం అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications