బాక్సాఫీస్ వద్ద భయంకరంగా ఢీకొన్న బాలయ్య, నాగార్జున
కింగ్ అక్కినేని నాగార్జున, నందమూరి నటసింహం బాలకృష్ణ మధ్య ప్రస్తుతం సంబంధాలు లేవు. అక్కినేని నాగేశ్వరరావు లాంటి సినీ పరిశ్రమ మూలస్తంభం మరణించినప్పుడు కూడా చూడటానికి బాలయ్య వెళ్లలేదు. అంతగా వీరిద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. అందుకు కారణాలేంటనేది వారిద్దరికే తెలియాలి. కొన్ని సంవత్సరాలుగా ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు నాగార్జున.. చిరంజీవితో అత్యంత సన్నిహితంగా ఉంటారు. ఇద్దరూ కలిసి వ్యాపారం చేస్తుంటారని ఫిలింనగర్ వర్గాలు అంటుంటాయి. భవిష్యత్తులో కూడా బాలయ్య, నాగార్జున మధ్య సత్సంబంధాలుండే అవకాశాలు లేవని సినీ విశ్లేషకులు అంటున్నారు.
ఒకప్పుడు ఎంతో సన్నిహితంగా ఉండేవారు
ఒకప్పుడు వీరిద్దరూ ఎంతో సన్నిహితంగా మెలిగేవారు. పరిశ్రమలో చాలా మంచి స్నేహితులుగా ఉండేవారు. ఎన్టీఆర్ వారసుడిగా బాలయ్య, అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా నాగార్జున అగ్ర కథానాయకులుగా చెలామణి అవుతున్నారు. 1994లో బాక్సాఫీస్ దగ్గర వీరిద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. ఆ సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన బాలయ్య, రోజా జంటగా నటించిన జానపద చిత్రం భైరవద్వీపం విడుదలైంది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో చందమామ విజయ కంబైన్స్ పతాకంపై వెంకట్రామిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. మాధవపెద్ది సురేశ్ సంగీతం అందించారు. సినిమా సంచలన విజయం సాధించింది.

నాగార్జున నటించిన హలో బ్రదర్ విడుదల
ఈ సినిమా విడుదలైన వారం రోజులకు నాగార్జున, సౌందర్య, రమ్యకృష్ణ నటించిన హలో బ్రదర్ సినిమా విడుదలైంది. దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కెఎల్ నారాయణ నిర్మించిన ఈ సినిమాకు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని నమోదు చేసింది. నాగార్జున సూపర్ హిట్ సినిమాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచిపోతుంది. బాక్సాఫీస్ దగ్గర బాలయ్య, నాగార్జున ఇద్దరూ విజయం సాధించారు. హలోబ్రదర్ విడుదల కాకుండా ఉంటే భైరవద్వీపం ఇండస్ట్రీ హిట్ గా నిలిచేదాని సినీ విశ్లేషకులు ఆ సమయంలో అభిప్రాయపడ్డారు. హలోబ్రదర్ సినిమా పలు భాషల్లో రీమేక్ అయింది. భైరవద్వీపం తర్వాత ఏ హీరో కూడా జానపద సినిమా చేయలేకపోయారు.












Click it and Unblock the Notifications