చిరంజీవి-బాలకృష్ణ కాంబోలో మిస్సయిన బ్లాక్బస్టర్
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ అనగానే కొన్ని దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఆధిపత్యం కోసం హోరాహోరీగా తలపడిన సందర్భాలే గుర్తుకు వస్తాయి. బయట వీరిద్దరూ కలుసుకోవడం కూడా చాలా అరుదుగా జరుగుతుండేది. వచ్చేనెలలో జరగబోతున్న నందమూరి బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ వేడుకకు కమిటీ సభ్యులు చిరంజీవిని ఆహ్వానించారు. సినిమాల్లో హీరో, విలన్ ఎలా తన్నుకుంటారో.. అలా నిజ జీవితంలో చిరంజీవి అభిమానులకు, బాలయ్య అభిమానులకు యుద్ధాలు జరుగుతుండేవి.
పట్టాలెక్కని ప్రయత్నాలు
వీరిద్దరితో మల్టీస్టారర్ సినిమా తీయాలని అగ్ర దర్శకులు, నిర్మాతలు కొందరు ప్రయత్నించారుకానీ సరైన కథ దొరక్కపోవడంతో ఆ ప్రయత్నం పట్టాలెక్కలేదు. కొన్ని కొన్ని సినిమాలను విడుదలైన తర్వాత మాత్రం వీరిద్దరితో తీస్తే బాగుండేదని ఎంతోమంది దర్శకులు, రచయితలు భావించారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కిన సినిమా శ్రీమంజునాథ. సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో ముందుగా అర్జున్ కు బదులుగా బాలకృష్ణతో చేయాలని రాఘవేంద్రరావు భావించి కథ చెప్పారు.

నో చెప్పిన బాలయ్య
అయితే అర్జున్ పాత్రకు అనుకున్నస్థాయిలో స్కోప్ లేదని భావించిన బాలయ్య నో చెప్పారు. తర్వాత అర్జున్-సౌందర్యతో, శివుడి పాత్రలో చిరంజీవిచేత నటింపచేసి రాఘవేంద్రరావు సూపర్ హిట్ అందుకున్నారు. అర్జున్ పాత్రలో బాలయ్య చేసివుంటే సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచేదని, కలెక్షన్లు కూడా భారీగా వచ్చేవని పలువురు విశ్లేషకులు అప్పుడే అభిప్రాయపడ్డారు.
రాఘవేంద్రరావుతోపాటు కోదండరామిరెడ్డి, బి.గోపాల్ లాంటి దర్శకులు కూడా బాలయ్య, చిరంజీవితో మల్టీస్టారర్ చేయాలని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. అన్నీ కథల దగ్గరే ఆగిపోయాయి. ప్రస్తుతం వరుసగా హిట్లు కొడుతూ బాలయ్య దూసుకువెళుతుండగా, చిరంజీవి విశ్వంభర చిత్రంతో వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకులను పలకరించబోతున్నారు.












Click it and Unblock the Notifications