'పుష్ప2' తీసిన 'మైత్రీ మూవీ మేకర్స్' బ్యాన్?
మైత్రీ మూవీ మేకర్స్ తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే భారీ నిర్మాణ సంస్థగా అవతరించింది. తెలుగుతోపాటు తమిళం, కన్నడం, హిందీల్లో కూడా సినిమాలు నిర్మిస్తోంది. ఆయా పరిశ్రమల్లోని అగ్ర నటులందరి కాల్షీట్లు ఈ సంస్థ చేతిలోనే ఉన్నాయి. వేరే నిర్మాతలెవరికీ వారి కాల్షీట్లు అందుబాటులో లేవు. అందుకు కారణం.. స్టార్ హీరోలందరికీ వారి స్థాయికి మించి అత్యధిక పారితోషికాన్ని అలవాటు చేసింది ఈ సంస్థే. ప్రత్యర్థి సంస్థలను దెబ్బతీసేందుకు నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, యెర్నేని నవీన్, చెరుకూరి మోహన్ ఈ పద్ధతిని ఎంచుకున్నారు. స్టార్ హీరోలతోపాటు మీడియం రేంజ్ హీరోలు, చిన్న హీరోలను కూడా ఈ సంస్థ తమ 'గ్రిప్'లో ఉంచుకుంది.
హీరోల కాల్షీట్లన్నీ ఈ సంస్థ చేతిలోనే?
తమిళంలో అజిత్ హీరోగా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' నిర్మిస్తోంది. హిందీలో సన్నీడియోల్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా నిర్మాణంలో ఉంది. 'శ్రీమంతుడు' సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టినీ ఈ సంస్థ 'భరత్ అనే నేను', 'జనతా గ్యారేజ్' లాంటి సినిమాలతో నిలదొక్కుకుంది. అందుబాటులో ఉన్న హీరోలతో మంచి కథలను ఎంచుకొని సినిమాలు తీస్తే బాగుంటుందని, అందులో తప్పేం ఉండదని, ప్రత్యర్థి సంస్థలను దెబ్బకొట్టేందుకు హీరోల కాల్షీట్లన్నీ తమ చేతిలో ఉంచుకునేందుకు వారికి అంతవరకు ఏ నిర్మాత ఇవ్వని పారితోషికాన్ని ఇవ్వడం సరికాదనే విమర్శలు వస్తున్నాయి. ఒకసారి ఎక్కువ పారితోషికం తీసుకున్న తర్వాత ఏ హీరోకూడా అంతకుమించి తక్కువ తీసుకోడు. అది ఇంకా పెరుగుతుందేకానీ తగ్గదు.

హీరోల రెమ్యునరేషన్ బడ్జెట్ పై పడుతోంది
ఈ సంస్థ హీరోలకు ఇస్తున్న పారితోషికం ప్రభావం సినిమాపై పడి బడ్జెట్ భారీగా పెరుగుతోంది. దీన్నుంచి బయటపడాలంటే ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకొని అనుకూలంగా టికెట్ ధరల పెంపు తెచ్చుకోవాలి. ఇదే విధానాన్ని ఈ సంస్థ అవలంబిస్తోంది. గతంలో ఎన్నో సినిమాలకు టికెట్ ధరల పెంపు ఉన్నప్పటికీ 'పుష్ప2'కు మాత్రం అత్యంత దారుణంగా టికెట్ ధరల పెంపు ఉంది. బెనిఫిట్ షో టికెట్ ధర రూ.1239 అంటే సామాన్య మానవుడు కుటుంబంతో కలిసి సినిమా చూసే అవకాశం ఉంటుందా? అనే ప్రశ్న ఎదురవుతోంది. తెలంగాణలో, ఆంధ్రలో ప్రభుత్వ పెద్దలతో ఈ సంస్థకు సన్నిహిత సంబంధాలున్నాయి. వారు అడిగితే టికెట్ ధరల పెంపు విషయంలో ప్రభుత్వాలు సానుకూలంగానే స్పందించే వాతావరణం ఉంది. కానీ హీరో రెమ్యునరేషన్, సినిమా బడ్జెట్ మొత్తం చివరకు రూ.1239గా అభిమానికానీ, సగటు సినీ ప్రేక్షకుడు కానీ భరించాల్సి వస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ చేతిలోనే ఉంది
పెట్టిన పెట్టుబడిని వారం రోజుల్లో తిరిగి రాబట్టుకుంటే నష్టాలుండవనే అభిప్రాయంతో ఈ నిర్ణయానికి అందరూ నిర్మాతలు వస్తున్నారు. ఈ తరహా విధానంతో ముందుకు వెళుతున్న మైత్రీ మూవీ మేకర్స్ ను నియంత్రించాలంటే టికెట్ ధరల పెంపును ఇవ్వకూడదని, బెనిఫిట్ షోలకు అనుమతులివ్వకూడదని, అలా చేస్తేనే సినిమా బడ్జెట్ తగ్గుతుందని, అలా తగ్గాలంటే హీరోలు పారితోషికాన్ని తగ్గించుకుంటారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిర్మాతలు ఇవ్వనంటే హీరోలు ఇంతేకావాలని మొండికేయరు. అలా మొండికేసి కూర్చుంటే ఏ నిర్మాతా వారితో సినిమా తీయడానికి ముందుకు రారు. నిర్ణయం తీసుకోవాల్సింది మైత్రీ మూవీ మేకర్స్ వారే. లేదంటే రానున్న రోజుల్లో సినిమా బడ్జెట్ ధరలు భారీగా పెరుగుతూ వస్తుంటాయి. టికెట్ ధరలు కూడా అలాగే పెంచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ఈ పోకడను ఆరంభంలోనే నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అలా కుదరనప్పుడు ఆ సంస్థను బ్యాన్ చేయడమే ఉత్తమమని, అలా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications