‘అఖండ2’ను వెంటాడుతున్న ‘రాజకీయం’
నందమూరి నటసింహం బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం అఖండ2. ఈనెల 5వ తేదీనే ఇది విడుదల కావాల్సి ఉన్నప్పటికీ ఇతర నిర్మాణ సంస్థలతో, ఈ సినిమా నిర్మాతలకు ఉన్న ఆర్థిక విభేదాలవల్ల వాయిదా పడింది. వివాదాలన్నీ పరిష్కారమైన తర్వాత 12వ తేదీన సినిమాను విడుదల చేస్తున్నారు. అయితే అప్పటితో కష్టాలన్నీ తీరిపోయాయనుకున్న అభిమానులకు, సినీ ప్రియులకు మరో పిడుగులాంటి వార్త వినపడింది. ఈ సినిమాకు మొదటి మూడు రోజులు టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే ధరలు పెంచడాన్ని సవాల్ చేస్తూ శ్రీనివాసరెడ్డి అనే న్యాయవాది తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
విచారణకు స్వీకరించింది
తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కూడా ఈ పిటిషన్ విచారణకు స్వీకరించడం విశేషం. ఏపీలో అఖండ2కు మొదటి పది రోజులు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిచ్చారు. అయితే తెలంగాణలో మాత్రం మూడు రోజులే ఇచ్చారు. అలా పెంచిన టికెట్ ధరల్లో కూడా 20 శాతం ఆదాయం సినీ కార్మికులకు కేటాయించాలి. దీనికోసం ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఒక ఖాతాను కూడా ప్రారంభించారు. థియేటర్లలో టికెట్ పై రూ.50, మల్టీప్లెక్స్ ల్లో టికెట్ పై రూ.100 పెంచుకునేందుకు, విడుదలకు ముందురోజు వేసే ప్రీమియర్ షో టికెట్ ధర రూ.600కు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఏపీలో థియేటర్లో రూ.75, మల్టీప్లెక్స్ ల్లో రూ.100, ప్రీమియర్ షో రూ.600కు అక్కడి ప్రభుత్వం అనుమతిచ్చింది.

ఈలోగా రోజులు గడిచిపోతాయిలే
ఈ జీవోను రద్దుచేయాలంటూ న్యాయవాది శ్రీనివాసరెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతో దీనివెనక ఎవరు ఉన్నారా? అంటూ బాలయ్య అభిమానులు ఆరా తీస్తున్నారు. అకస్మాత్తుగా సినిమా విడుదలయ్యే సమయంలో పిటిషన్ వేయడం, దాన్ని కోర్టు విచారణకు స్వీకరించడం వెనక రాజకీయ కారణాలున్నాయంటూ బాలయ్య అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కోర్టు ప్రభుత్వ జీవోను సస్పెన్షన్ చేస్తూ విచారణ 12వ తేదీకి వాయిదా వేసింది. 12వ తేదీనే సినిమా విడుదలవుతోంది. అయితే పెరిగిన ధరల ప్రకారమే నడుస్తాయని, ఎందుకంటే నిర్మాతలు కూడా లంచ్ మోషన్ పిటిషన్ కు వ్యతిరేకంగా పిటిషన్ వేస్తారు కాబట్టి ఈలోగా తెలంగాణలో మూడు రోజులు, ఏపీలో 10 రోజులు గడిచిపోతాయని సినీ విశ్లేషకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications