కంట కన్నీరొలికిస్తున్న శ్రీతేజ్ పరిస్థితి
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో నాలుగోతేదీ రాత్రి జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే 32 సంవత్సరాల మహిళ మృతి చెందింది. అదే ఘటనలో ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు శ్రీతేజ్ గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో 56 రోజుల నుంచి చికిత్స పొందుతున్నారు. ఈరోజు వరకు ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పు చోటుచేసుకోలేదు. దీనిపై ఆ బాలుడి కుటుంబ సభ్యులంతా ఆందోళన చెందుతున్నారు. పుష్ప2 సినిమా బెనిఫిట్ షో చూసేందుకు సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్ రావడం.. అభిమానులంతా తోసుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
సొంతంగా ఊపిరి తీసుకుంటుండటంతో
శ్రీతేజ్ చికిత్స కోసం చేస్తున్న ఖర్చును తామే భరిస్తున్నామని అల్లు అర్జున్ టీం ప్రకటించింది. అయితే అదంతా అబద్దమని, ఖర్చును ప్రభుత్వమే భరిస్తోందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటించారు. వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న శ్రీతేజ్ పరిస్థితిలో ఎటువంటి మార్పు లేకపోవడంతో మెరుగైన చికిత్స కోసం విదేశాలకు తరలించాలనే నిర్ణయాన్ని తీసుకున్న నిర్మాత బన్నీవాసు ప్రకటించారు. కొంతకాలం ఐసీయూలో ఉన్న శ్రీతేజ్ తర్వాత సొంతంగా ఊపిరి పీల్చుకుంటుండటంతో వేరే గదికి మార్చారు. ఇప్పటివరకు ఆ బాలుడిని పేరు పెట్టి పిలిచినా కళ్లు తెరిచి చూడలేకపోతుండటంతోపాటు నోరు విప్పి ఏమీ మాట్లాడలేకపోతున్నాడు.

ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో?
శ్రీతేజ్ కు ఆహారాన్ని ద్రవరూపంలో అందిస్తున్నారు. ఇందుకు ముక్కు దగ్గర సన్నని గొట్టం ఏర్పాటుచేసి దానిద్వారా ఆహారాన్ని పంపిస్తున్నారు. ఎప్పటిలోగా కోలుకుంటాడు అనే విషయాన్ని వైద్యులు కూడా చెప్పలేకపోతున్నారు. వాస్తవానికి తొక్కిసలాట జరిగిన సమయంలో శ్రీతేజ్ స్పృహ తప్పి పడిపోయాడు. శ్రీతేజ్ ను గమనించిన పోలీసులు ఆ బాలుడి ఊపిరి ఆగిపోయిందని గమనించి వెంటనే సీపీఆర్ చేశారు. తర్వాత ఊపిరి తీసుకోవడంతో వెంటనే కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అవసరమైతే మెరుగైన చికిత్స కోసం విదేశాలకు కూడా తరలిస్తామని గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు బన్నీ వాసు వచ్చి విదేశాలకు తరలిస్తామని చెప్పడంతో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై తండ్రి భాస్కర్, చెల్లి శాన్వి ఆందోళన చెందుతున్నారు. అన్నయ్య మాట్లాడతాడనే ఉద్దేశంతో శాన్వి ఆసుపత్రి దగ్గరే ఉంటోంది.












Click it and Unblock the Notifications