బాలీవుడ్ "రామాయణ" ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్.. రణ్బీర్, యష్ లుక్స్ అదుర్స్ !
భారతీయ సంస్కృతి, ధర్మ పరిరక్షణకు ప్రతీకగా నిలిచే ఇతిహాస గాథ అంటే రామాయణం అనే చెప్పాలి. రామాయణాన్ని ఆధారంగా చేసుకొని తెలుగులోనే కాకుండా పలు భాషల్లో సైతం ఇప్పటికే ఎన్నో చిత్రాలు తెరకెక్కి ఘన విజయాలు సాధించాయి. ఇప్పుడు మళ్లీ మరోసారి బాలీవుడ్ లో భారీ తారాగణంతో.. భారీ బడ్జెట్ తో "రామాయణ" పేరుతో మూవీ తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు నితేశ్ తివారీ రూపొందిస్తున్న ఈ ప్రాజెక్ట్పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, కన్నడ రాక్స్టార్ యష్ రావణుడిగా నటిస్తున్నారు. అలాగే రవి దుబే లక్ష్మణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీత దర్శకులుగా హాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ వ్యవహరిస్తున్నారు. అలానే శ్రీధర్ రాఘవన్ రచయితగా పని చేస్తుండగా.. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. మొదటి భాగాన్ని 2025 దీపావళికి, రెండో భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేయనున్నారు.

కాగా ఎప్పటి నుంచో ఈ సినిమాకు సంబంధించి వార్తలు వినిపిస్తున్నప్పటికీ అఫిషియల్ గా ఈరోజు గ్లింప్స్ వీడియో రిలీజ్ చేసి ఆడియన్స్ కి గిఫ్ట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా రిలీజ్ అయిన వీడియోను గమనిస్తే.. బ్రహ్మ.. సృష్టించే దేవుడు, విష్ణువు.. రక్షించే దేవుడు, శివుడు.. అంతం చేయగలిగే దేవుడు.. కానీ వారి సృష్టి మూడు లోకాలపై ఆధిపత్యం కోసం ఎదురుతిరిగినప్పుడు అన్ని యుద్ధాలను అంతం చేసే యుద్ధం ప్రారంభమైంది. 5000 సంవత్సరాల నుంచి 2500 కోట్ల మంది ప్రజలచే ఆరాధించబడుతున్నది. ఇది ఒక అమరమైన ఇతిహాస గాథ అంటూ చూపించారు.
కానీ చివర్లో మాత్రం రాముడిగా రణ్బీర్ కపూర్.. రావణుడిగా యష్ ని చూపించారు. వీడియోలోని వీఎఫ్ఎక్స్, సౌండ్ డిజైన్, విజువల్స్ గూస్ బంప్స్ ఇచ్చేలా ఉన్నాయి. ఈ వీడియోకి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
రామాయణం ఆధారంగా రూపొందిన గతంలో వచ్చిన సినిమాలు..
'సంపూర్ణ రామాయణం' (1958) - ఎన్టీఆర్ శ్రీరాముడిగా, శోభన్ బాబు లక్ష్మణుడిగా, సావిత్రి సీతగా నటించిన ఈ తెలుగు చిత్రం ఘన విజయం సాధించింది.
'లవ కుశ్' (1963) - హిందీ భాషలో వచ్చిన ఈ చిత్రం శ్రీరాముడి పిల్లల కథ ఆధారంగా రూపొందింది.
'రామాయణం - ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ' (1992) - భారత్-జపాన్ సంయుక్తంగా రూపొందిన యానిమేటెడ్ మూవీ, ఇంటర్నేషనల్ ఆడియన్స్కు భారత ఇతిహాసాన్ని పరిచయం చేసింది.
'రామాయణం' (1997) - తెలుగు బాలనటులతో రూపొందిన ఈ సినిమా పిల్లలతో పాటు పెద్దలలో కూడా ఆదరణ పొందింది.
'అదిపురుష్' (2023) - ప్రభాస్ నటించిన ఈ చిత్రం భారీ బడ్జెట్తో తెరకెక్కినా, డైలాగ్స్, వీఎఫ్ఎక్స్ విషయంలో విమర్శలు ఎదుర్కొంది.
'హనుమాన్' (2005) - హనుమంతుడి జీవితంపై రూపొందిన యానిమేటెడ్ ఫిల్మ్ పిల్లలలో విపరీతంగా పాపులర్ అయింది.
మరి ఈసారి రణ్బీర్, యష్, సాయి పల్లవి, సన్నీ డియోల్ వంటి ప్రముఖ తారాగణంతో తెరకెక్కుతున్న 'రామాయణ' చిత్రం భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందా లేదా అనేది తెలియయాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు.












Click it and Unblock the Notifications