ఓయమ్మా.. చిన్న సినిమాకి 300 కోట్ల కలెక్షన్స్ !
బాలీవుడ్.. భారతీయ చిత్ర పరిశ్రమలో హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అయితే కొంతకాలంగా బాలీవుడ్ కష్టాల్లో ఉందన్న విషయాన్ని ఒప్పుకోవాల్సిందే. పరిశ్రమలో పలు వివాదాలు.. విమర్శల వాళ్ళ గడ్డు కాలం నడుస్తోంది. వీటికి తోడు స్టార్ హీరోల సినిమాలు కూడా వరుసగా ఫెయిల్ అవుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఓ చిన్న సినిమా.. హిందీ పరిశ్రమకు ఊపిరి పోస్తుంది. భారీ కలెక్షన్స్ కొల్లగొడుతూ.. బాలీవుడ్ మళ్లీ బౌన్స్బ్యాక్ అవుతుందన్న నమ్మకాన్ని తీసుకొచ్చింది.
"సైయారా"..
బాలీవుడ్లో ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్పై.. 'ఆషికీ 2' తెరకెక్కించిన మోహిత్ సూరి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం "సైయారా". ఈ సినిమాతో అనన్య పాండే సోదరుడు ఆహాన్ పాండే హీరోగా పరిచయమవగా, 'సలాం వెంకీ' ఫేమ్ అనీత్ పడ్డా హీరోయిన్గా నటించింది. జూలై 18న గ్రాండ్గా థియేటర్లలో విడుదలైంది ఈ చిత్రం.

ఈ సినిమాలో భారీ ఫైట్స్ , పవర్ఫుల్ డైలాగ్స్.. ఆకర్షణీయ విజువల్ ఎఫెక్ట్స్ లేకపోయినా బలమైన ఎమోషన్ తో ప్రేక్షకులను కట్టిపడేశారు. కథ సింపుల్ అయినా.. స్క్రీన్ప్లేతో మ్యాజిక్ చేసి కొత్తగా ప్రజెంట్ చేశారు. నేటి తరానికి తగ్గట్టు ఎమోషన్స్ తీసుకెళ్లడం.. సినిమాలో హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగా పని చేసింది. మ్యూజిక్ సినిమాకి ప్రాణం పోసింది. ముఖ్యంగా లవ్ ప్రపోజ్ సీన్ ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. ''ఆ ఒక్క సీన్ కోసమే సినిమా చూడొచ్చు'' అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
300 కోట్ల క్లబ్..
60 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమాను.. మొదట 8000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. కాగా ఫస్ట్ షో నుంచే పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో 10000 స్క్రీన్లకు పెంచారు. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ సినిమా బ్రేక్ ఈవెన్కి రావాలంటే 60 కోట్ల షేర్, 120 కోట్ల గ్రాస్ రాబట్టాలని అంచనా వేశారు. అయితే అందరికీ షాక్ ఇస్తూ ఈ మూవీ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజు 21.5 కోట్లతో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టగా.. ఇప్పటివరకు ఈ చిత్రం 260 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. దీంతో అతికొద్ది రోజుల్లోనే 300 కోట్ల క్లబ్లో చేరుతుందని భావిస్తున్నారు.

సినిమా స్టోరీ..
క్రిష్ కపూర్కు సంగీతమంటే ప్రాణం. గొప్ప కంపోజర్ కావాలన్నది అతడి కల. ఓ సందర్భంలో క్రిష్ని చూసిన జర్నలిస్టు, లిరిసిస్ట్ వాణీ బాత్రా అతడిని ఇష్టపడుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. అదే సమయంలో.. ప్రేమ పేరుతో వాణిని మోసం చేసిన మహేశ్ మళ్లీ ఆమె జీవితంలోకి వస్తాడు. ఆ తర్వాత క్రిష్లో వచ్చిన మార్పేంటి? అనుకున్న లక్ష్యం చేరాడా? మహేశ్, క్రిష్లలో వాణి ఎవరిని వివాహం చేసుకుంది? అనేది స్టోరీ..
మరోవైపు ఈ సినిమాపై మహేష్ బాబు, సుకుమార్ వంటి టాప్ సెలెబ్రిటీల నుంచి ప్రశంసలు రావడంతో తెలుగులో కూడా మరింత హైప్ క్రియేట్ అయ్యింది.












Click it and Unblock the Notifications