"మళ్లీ పెళ్లి చేసుకుంటానని అనుకోలేదు.. అతడి వల్లే ఇదంతా"
ఈ జనరేషన్ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల లిస్టులో సమంత టాప్ లో ఉంటారు. తెలుగులో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలందరితోనూ నటించి బ్లాక్ బస్టర్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు సామ్. 2010 లో ఏమాయె చేశావే చిత్రంతో టాలీవుడ్ లో మొదలైన ఆమె ప్రస్థానం.. ఆ తర్వాత బృందావనం, దూకుడు, ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది.. ఇలా వరుసగా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నారు. తెలుగుతోపాటు అటు తమిళంలోనూ పలు హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ సెపరేట్ ఫ్యాన్స్ ను ఏర్పరుచుకున్నారు.
అయితే సమంత గురించి ప్రస్తావించాల్సి వస్తే.. ఆమె జర్నీ విడాకుల ముందు.. విడాకుల తర్వాత అని చెప్పొచ్చు. 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' నుండి 'మా ఇంటి బంగారం' వరకు.. సమంత ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం అని చెప్పొచ్చు. ఇక అక్కినేని నాగచైతన్య, సమంత 2017లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పలు కారణాలతో వీరిద్దరూ 2021 లో విడిపోయారు. ఆ తర్వాత ఎవరి జీవితం వారు గడుపుతున్నారు.
ఆ తర్వాత సమంత, బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుల పరిచయం 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ ద్వారా ప్రారంభం అయింది. రాజ్ ఈ సిరీస్ కు దర్శకత్వం వహించారు. అప్పటినుంచి వీరి మధ్య ఏర్పడిన అనుబంధం పెళ్లి వరకూ వెళ్లింది. అలా గతేడాది డిసెంబర్ లో రాజ్ నిడిమోరును భూత శుద్ధి పద్ధతిలో వివాహం చేసుకున్నారు సమంత. ప్రస్తుతం వీరిద్దరూ తమ ప్రొఫెషనల్ లైఫ్ లో ఎంతో బిజీగా ఉన్నారు.

అయితే సమంత తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తన విడాకులు, రాజ్ నిడిమోరుతో రిలేషన్ పై మాట్లాడారు. చైతన్యతో విడాకుల తర్వాత ఎవరినీ నమ్మాలని అనిపించలేదని.. అయితే అదృష్టం కొద్దీ రాజ్ దొరికాడని చెప్పారు. విడాకుల తర్వాత తాను పూర్తిగా కుంగిపోయానని.. నా ప్రపంచాన్ని పూర్తిగా మూసేశానని అన్నారు. మళ్లీ ఇంకొకరిపై ఆధారపడతానని ఎప్పుడూ అనుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రాజ్ తన జీవితంలోకి వచ్చిన తర్వాతే తనలో ఎంతో మార్పు వచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం స్నేహితులు కూడా నాలో ఆ మార్పును గమనించారని తెలిపారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications