రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు..కొత్త సినీ యుగానికి శ్రీకారం
సాగర్ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ భారతీయ సినిమా ప్రపంచంలో ఒక నూతన శకానికి శ్రీకారం చుడుతోంది. ఒకప్పుడు 'రామాయణ్', 'శ్రీ కృష్ణ' వంటి అజరామరమైన దృశ్య కావ్యాలతో కోట్లాది మంది భారతీయుల ఇళ్లల్లో, హృదయాల్లో భక్తిపరవశాన్ని నింపిన రామానంద్ సాగర్ కుటుంబం.. ఇప్పుడు అదే ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని వెండితెరపై అత్యంత వైభవంగా ఆవిష్కరించేందుకు సిద్ధమైంది.
భారతీయ పురాణ చరిత్రలోనే అత్యంత విస్తృతమైన కథా సముద్రం 'శ్రీమద్భాగవతం'. ఈ పవిత్ర గాథను కేవలం రెండు మూడేళ్ల వ్యవధిలో లేదా ఒకే సినిమాలో చూపించడం సాధ్యం కాదు. అందుకే దీనిని ఒక భారీ సినిమాటిక్ యూనివర్స్గా మలచి, మొత్తం ఏడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ ఆధ్యాత్మిక మహాగాథలో తొలి అడుగుగా 'శ్రీమద్భాగవతం: పార్ట్ వన్ - విష్ణురథ' రూపుదిద్దుకుంటోంది.

దివంగత రామానంద్ సాగర్ వారసత్వపు బాధ్యతలను ఆయన మనవళ్లు ఆకాశ్ సాగర్ చోప్రా, అమృత్ సాగర్ తమ భుజస్కంధాలపై వేసుకున్నారు. '1971' చిత్రంతో జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకున్న అమృత్ సాగర్, అనుభవజ్ఞుడైన ఆకాశ్ సాగర్తో కలసి ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పాత తరం భావోద్వేగాలను, భక్తి శ్రద్ధలను కాపాడుతూనే.. నేటి తరం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఆధునిక సినిమాటిక్ శైలిలో ఈ కథను మలుస్తున్నారు. హైదరాబాద్లోని ప్రసిద్ధ రామోజీ ఫిల్మ్ సిటీలో వైభవంగా ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ కోసం అత్యంత భారీ సెట్లు, అద్భుతమైన ప్రొడక్షన్ డిజైన్ను సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాచీన పౌరాణిక ప్రపంచాన్ని విజువల్ వండర్గా మార్చేందుకు అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు భాగస్వాములవుతున్నారు.
Life of Pi, The Jungle Book, Game of Thrones వంటి ప్రపంచ ప్రసిద్ధ చిత్రాలు, సిరీస్లకు పనిచేసిన ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుడు క్లైడ్ ఎడ్వర్డ్స్ ఈ చిత్రానికి పనిచేస్తుండటం విశేషం. కేవలం గ్రాఫిక్స్ కోసమే కాకుండా, కథలోని ఆధ్యాత్మిక లోతును, సాంస్కృతిక మూలాలను చెడగొట్టకుండా అత్యాధునిక సాంకేతికతతో దృశ్య రూపం ఇస్తున్నారు. ఇది కేవలం మరొక భక్తి చిత్రం కాదు, సాంస్కృతిక మూలాలు, కుటుంబ వారసత్వం, ఆధునిక సాంకేతికత , భారీ నిర్మాణం కలగలిసిన ఒక అరుదైన సినీ ప్రయోగం. మన ప్రాచీన పురాణ వైభవాన్ని నేటి ఆధునిక తరానికి వారి భాషలోనే, అంతర్జాతీయ ప్రమాణాలతో అందించడమే లక్ష్యంగా 'విష్ణురథ' థియేటర్లలోకి రాబోతోంది. రామాయణంతో మొదలైన సాగర్ కుటుంబ పయనం.. ఇప్పుడు 'శ్రీమద్భాగవతం'తో భారతీయ వెండితెరపై ఒక నూతన విజువల్ వండర్కు తెరదీస్తోంది.














Click it and Unblock the Notifications
