500 రోజులు ఆడిన తెలుగు సినిమా తెలుసా?
పాత సినిమాలు నిర్మించే సమయంలో నటీనటులతోపాటు నిర్మాత దర్శకులు కూడా తమ జీవితాన్ని పణంగా పెట్టి వాటిని నిర్మించేవారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడేవారు. అందుకు తగ్గట్లుగానే విడుదలైన ఆ సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచేవి. ఆ కోవలోనే ఒక సినిమా సంచలనం సృష్టించింది. 100 కాదు.. 200 కాకుండా ఏకంగా 500 రోజులు ఆడి రికార్డు సృష్టించింది.
భవిష్యత్ తరాలకు గుర్తుండిపోయే విధంగా ఎన్టీఆర్ పౌరాణిక చిత్రాల్లో నటించేవారు. రాముడు, కృష్ణుడు ఎలా ఉంటారో తెలియకపోయినప్పటికీ ఆయా సినిమాల్లో ఆ పాత్రలు పోషించిన రామారావునే ప్రజలు రాముడిగా, కృష్ణుడిగా పరిగణించేవారు. పౌరాణిక, జానపద చిత్రాలతోపాటు సాంఘిక చిత్రాలు కూడా చేశారు. దాదాపు ఆయన నటించిన చిత్రాలన్నీ విజయవంతమయ్యాయని చెప్పవచ్చు.

ఎన్టీఆర్ నటించిన పౌరాణిక చిత్రాల్లో లవకుశ సినిమా ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయింది. ఈ సినిమాలో నందమూరివారు చెప్పే డైలాగ్ లు, పద్యాలు ఆద్యంతం ఆకట్టుకుంటాయి. రామాయణం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో ఎన్టీఆర్ రాముడిగా, సీతగా అంజలీ దేవి, లవకుశలుగా ఇద్దరు బాల నటులు చేశారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో విడుదలై ఘనవిజయాన్ని సాధించింది. ఆరోజుల్లో అతి పెద్ద సంచలనంగా నిలిచింది. 1963 మార్చి 29న విడుదలైన ఈ సినిమాను చూసేందుకు ప్రజలు ఎడ్ల బళ్లు కట్టుకొని థియేటర్లకు వచ్చేవారు.
ఈ సినిమా ఏకంగా 500 రోజులు ఆడింది. అంతకుముందు ఎన్టీఆర్ నటించిన పాతాళ భైరవి 245 రోజులు నడిచింది. ఆ సినిమా రికార్డును లవకుశతో ఎన్టీఆర్ బ్రేక్ చేశారు. అప్పట్లోనే కోటిరూపాయల వసూళ్లు సాధించింది. తమిళంలో ఏకంగా 40 వారాలు నడిచింది. హిందీలో 25 వారాలు నడిచింది. ఆ రోజుల్లోనే ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరో అయిపోయారు. అల్లారెడ్డి శంకర్ రెడ్డి నిర్మాణంలో వచ్చిన లవకుశ తెలుగులో తొలి కలర్ సినిమా. లక్ష్మణుడిగా కాంతారావు, భరతుడిగా సత్యనారాయణ, శత్రఘ్నడిగా శోభన్ బాబు, లవుడుగా నాగబాబు, కుశుడిగా సుబ్రహ్మణ్యం నటించారు.












Click it and Unblock the Notifications