రోహిత్ ఇంటిపై బుల్లెట్ల వర్షం: 4 రౌండ్లు కాల్పులు- ఉద్రిక్తత
ముంబైలో అర్ధరాత్రి కలకలం చెలరేగింది. జుహూ ప్రాంతంలో ఉన్న బాలీవుడ్ దర్శకుడు రోహిత్ షెట్టి నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు. మొత్తం నాలుగు రౌండ్ల పాటు కాల్పులు జరిపి, పారిపోయారు. ఈ ఘటనతో ముంబై ఉలిక్కిపడింది. హై సెక్యూరిటీ జోన్ గా పరిగణించే జుహూలో కాల్పుల ఉదంతం చోటు చేసుకోవడంతో బాలీవుడ్ దిగ్భ్రాంతికి గురైంది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కాల్పులు జరిగిన సమయంలో రోహిత్ షెట్టి ఇంట్లో ఉన్నారా లేదా అనే విషయం ఇప్పటివరకు స్పష్టంగా తెలియదు. ఈ ఘటన నేపథ్యంలో రోహిత్ షెట్టి ఇంటి పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. భద్రతను పటిష్టం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు జుహూ పోలీసులు. దర్యాప్తు చేపట్టారు. ఈ కాల్పులు జరగడానికి గల కారణాలు, దీనికి తెగబడిందెవరనేది ఇంకా తెలియరావట్లేదు. ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.

కాల్పుల ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తోన్నామని ముంబై పోలీస్ కమిషనర్ వెల్లడించారు. నిందితులను గుర్తించడానికి ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఫోరెన్సిక్ టీమ్ ప్రస్తుతం సంఘటన స్థలానికి చేరుకుందని, కాల్పుల కోసం వినియోగించిన గన్ ఎటువంటిదనేది ఆరా తీస్తోన్నామని వివరించారు. అలాగే- సీసీటీవీ కెమెరాల ద్వారా నిందితుల కదలికలను పసిగట్టే ప్రయత్నం చేస్తోన్నామని అన్నారు.
రోహిత్ షెట్టి.. హిందీ సినిమా పరిశ్రమలో టాప్ దర్శకుడు, నిర్మాత. గోల్మాల్ కామెడీ సిరీస్తో మంచి గుర్తింపు పొందారు. సింగమ్, సింబా, సూర్యవంశీ, చెన్నై ఎక్స్ప్రెస్, దిల్వాలే వంటి అనేక బ్లాక్బస్టర్ యాక్షన్ చిత్రాలను అందించారు. ప్రస్తుతం గోల్ మాల్ 5 తెరకెక్కిస్తోన్నారు. వచ్చే ఏడాది విడుదల కానుందీ మూవీ.












Click it and Unblock the Notifications