ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న టాలీవుడ్ నటుడు..
టాలీవుడ్లో విలన్ పాత్రల్లో తనదైన ముద్రవేసి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సాయాజీ షిండే. తెలుగులో ఎన్ని సినిమాల్లో విలన్ పాత్రలు, సహయ నటుడిగా కనిపించి మెప్పించాడు. సాయాజీ. అయితే, ప్రస్తుతం ఆయన ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు గా వార్తలు వస్తున్నాయి. గతకొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న షిండే. నిన్న (ఏప్రిల్ 11న) అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. గురువారం నాడు ఛాతి నొప్పి రావడంతో వెంటనే ఆయనను కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది.
ఆసుపత్రిలో కొన్ని పరీక్షలు చేసిన డాక్టర్లు ఆయన గుండెలో వెయిన్ బ్లాక్ అయినట్లు గుర్తించారు. వెంటనే యాంజియోప్లాస్టీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు డాక్టర్లు వివరించారు. త్వరలోనే ఆయన డిశ్చార్జ్ కానున్నట్లు సమాచారం. అయితే, సాయాజీకి కొన్నిరోజుల క్రితమే ఛాతిలో నొప్పి వచ్చిందని, అప్పుడే ఆసుపత్రికి వచ్చి కొన్ని పరీక్షలు చేయించుకున్నారని అక్కడి డాక్టర్లు తెలిపారు. ఈసీజీ పరీక్ష చేయగా, గుండెలో వెయిన్ బ్లాక్ ఉన్నట్లు గుర్తించినట్లు వైద్యులు చెప్పారు. ఆ తర్వాత మళ్లీ నిన్న ఛాతి నొప్పి రావడంతో వెంటనే అతడికి యాంజియోప్లాస్టీ చేశామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు వివరించారు.

విలన్ పాత్రలో మెప్పించిన సాయాజీ..
సాయాజీ షిండే తెలుగులో ఎన్నో చిత్రాల్లో విలన్ పాత్రలో పోషించారు. సహనటుడిగా కూడా ఈయన ఎన్నో సినిమాలు చేశారు. పోకిరి సినిమాలో పోలీస్ పాత్రలో అద్భుతంగా చేశారు. అలాగే, అరుంధతి సినిమాలో విభిన్నమైన రోల్లో కనిపించారు. ఇంకా చాలా సినిమాల్లో నటించారు. గత కొంతకాలంగా ఈయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. సాయాజీ షిండే ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని వేడుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో చాలామంది స్టార్ నటులు యాంజియో ప్లాస్టీ చేయించుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బీగ్బీ అమితాబ్బచ్చన్ కూడా ఈ సర్జరీ చేయించుకున్నారు.












Click it and Unblock the Notifications