Fact Check:హుబ్లీ బస్టాండులో ఉగ్రవాదులు..? అసలేం జరిగింది..?
హుబ్లీ: సోషల్ మీడియాలో అవాస్తవమైన వార్తలు విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి. తాజాగా కర్నాటక రాష్ట్రం హుబ్లీ బస్టాండులో ఉగ్రవాదులు అన్న పేరుతో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఈ వీడియో చాలా మందిని ఆందోళనకు గురిచేసింది. కర్నాటకలోని హుబ్లీ బస్టాండులో ఉగ్రవాదులు నక్కి ఉన్నారని చాలామంది తమ ఫోన్లలోని కెమెరాతో బంధించారనే వార్త సోషల్ మీడియాను చుట్టేసింది.
వైరల్ అవుతున్న వీడియో పై వన్ఇండియా ఆరా తీయగా అసలు వాస్తవం తెలిసింది. హుబ్లీ బస్టాండులో జరిగిన మాక్ డ్రిల్గా తేలింది. దీనిపై స్థానిక పత్రిక కూడా ఒక కథనం ప్రచురించింది. హుబ్లీ మరియు దార్వాడ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన మాక్ డ్రిల్ అని ఆ కథనంలో ఉంది.మన చుట్టూనే ఉంటూ అనుమానంగా ఉన్న వారిపట్ల ఎలా ఉండాలో చెబుతూ ఆగష్టు 22న మాక్డ్రిల్ నిర్వహించడం జరిగింది. స్థానికుల్లో అవగాహన తీసుకొచ్చేందుకే ఈ మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగిందని స్పష్టమైంది.
ఒకవేళ నిజంగానే ఉగ్రవాదులు వస్తే పరిస్థితేంటనేదానిపై మాక్ డ్రిల్ రూపంలో చేసి చూపడం జరిగింది. ఆ సమయంలో ఎలా వ్యవహరించాలో ఈ వీడియోలో చూపించడం జరిగింది. ఇదే తరహా మాక్ డ్రిల్ను హుబ్లీ ఎయిర్పోర్టులో కూడా నిర్వహించడం జరిగింది. ఈ మాక్డ్రిల్ను వీడియో తీసిన కొందరు పోలీసులు ఉగ్రవాదులను పట్టుకున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఇది వైరల్ అయ్యింది.
Fact Check
వాదన
హుబ్లీ బస్టాండులో ఉగ్రవాదులు
వాస్తవం
పౌరులను అలర్ట్ చేసేందుకు పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు