కెసిఆర్ ముందడుగు

ఇదిలా వుంటే, తెలంగాణ ఉద్యమ పార్టీలను, సంస్థలను ఏకం చేయడానికి ఆదివారంనాడు ఈ నెల 14వ తేదీన ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏకీకరణకు ప్రతిపాదనలు పెట్టే కన్నా తెరాసపై విమర్శలు చేయడానికే కొంత మంది ప్రాధాన్యం ఇచ్చారు. అలాంటి విమర్శలు చేసినవారి ముఖ్యమైన ఆక్షేపణ - తెరాసలో సామాజిక న్యాయం లేదనేది. నిజానికి, చెప్పాలంటే సామాజిక న్యాయ సూత్రాన్ని పూర్తిగా ఆమోదిస్తున్నది తెలంగాణ సంస్థలే. తెలంగాణను మోసం చేశారని ఇప్పుడే కెసిఆర్ మీది విమర్శలు పెట్టడం కూడా సరైంది కాదు. ఆయనను ప్రజలు నిర్దేశిస్తున్నారనే విషయాన్ని విస్మరించకూడదు. అలాగే, తెలంగాణ ఉద్యమ పార్ట్లీల్లో గానీ, సంస్థల్లో గానీ సామాజిక న్యాయసూత్రాన్ని పాటించాలనే అంశాన్ని అంతర్గత చర్చకు పెడితే మంచిది. ఆ చర్చను తెరాస కూడా ఆహ్వానిస్తుంది. ఆదివారంనాటి సమావేశంలో ఏకీకరణ కోసం ప్రతిపాదనలు పెట్టే వారిలో తెరాస ప్రతినిధి కూడా ఉన్నారు. వేదిక మీదికి పిలిచి అవమానించడం వల్ల ఏకీకరణకు ప్రాతిపదిక ఏర్పడదు. పరస్పర గౌరవ భావంతోనే ఏకీకరణ అనేది సాధ్యమవుతుంది. పైగా, ఉప ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పోటీ చేసినవారు ఏకీకరణకు పిలుపునిస్తే కూడా కాదనకుండా కెసిఆర్ తన ప్రతినిధిని సమావేశానికి పంపారు. ఈ విషయాన్ని వక్తలు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏకీకరణ జరగాలనే చిత్తశుద్ధి ఉంటేనే పరస్పర గౌరవ భావన అనేది ఉంటుంది.
తెలంగాణ శక్తుల ఏకీకరణ దిశగా ఉమ్మడి కార్యాచరణ కోసం ఈ నెల 28వ తేదీన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలోనైనా శత్రుపూరిత వైఖరితో కాకుండా మిత్రపూరిత వైఖరితో వ్యవహిరిస్తారని ఆశిద్దాం. చంద్రశేఖరరావును వ్యతిరేకించేవారు, ఆ తర్వాత ఏకీకరణకు సమావేశాలు పెట్టే వారు ఒకరే కావడం, దాన్ని కూడా చంద్రశేఖర రావు గౌరవించడమనే విషయాన్ని ఎలా చూస్తారనేది కూడా ముఖ్యమే అవుతుంది. ఇంత కాలం తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా నిలబెట్టిన ఘనత, తెలంగాణ అంశాన్ని జాతీయ స్థాయిలో చర్చకు పెట్టిన చరిత్ర, ఇవాళ తెలంగాణ గ్రామాల్లో ప్రజలు శిరసెత్తుకుని తిరగడానికి అనువైన వాతావరణాన్ని కల్పించిన రాజకీయ కార్యాచరణ ఫలితం చంద్రశేఖరరావుకే దక్కుతుంది.
వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ ఉద్యమ సంస్థలను పక్కన పెట్టైనా సరే, తెలంగాణ ఉద్యమ పార్టీలు ఒక అవగాహనకు రావాల్సిన అవసరం ఉంది. వామపక్షాలు ముందు ఒక అవగాహనకు వచ్చి ఇతర పార్టీలతో సర్దుబాటుకు సిద్ధం కావడం చాలా కాలంగా చూస్తూనే ఉన్నాం. తెలంగాణ ఉద్యమ పార్టీలు కూడా ఈ విధానాన్ని అనుసరించడం తెలంగాణ ఉద్యమానికి అత్యంత అవసరమైన పరిణామం. గత ఎన్డియె పాలనలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ అడ్డు పడిన మాట వాస్తవమే. ఈ విషయాన్ని బిజెపి అగ్రనేత ఎల్.కె. అద్వానీ తమ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు ప్రసంగంలో చెప్పారు. అయితే తెలుగుదేశం పార్టీ తన వైఖరిని మార్చుకుని ముందుకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణకు పూర్తి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే తెలుదేశంపార్టీతో తెలంగాణ ఉద్యమ పార్టీలు పొత్తు పెట్టుకోవడమే మంచిది. చిరంజీవి ప్రజారాజ్యంతో కూడా ఆ పార్టీ తెలంగాణకు పూర్తి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటేనే పొత్తుకు సిద్ధపడాలి. కేవలం సామాజిక న్యాయసూత్రం మంత్రం సిరపోదు. తెలంగాణ పార్టీల్లో సామాజిక న్యాయ సూత్రం అమలయ్యే విధానాన్ని మనం అమలు చేసుకునే పరిస్థితులను కల్పించుకోవడం అవసరం. కాంగ్రెస్ కూడా తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రకటనను ప్రజలను నమ్మే స్థితిలో లేరు. కాబట్టి తెలంగాణలో కాంగ్రెసును ఏకాకిని చేయడం ఎంతైనా అవసరం.












Click it and Unblock the Notifications