అరెస్టుతో వైయస్ జగన్ హీరో అయ్యారు
భారత రాజకీయాల్లో ఇటీవల కనిపించని నాయకత్వ ప్రతిభను, వ్యూహాన్ని జగన్ అనుసరించారు. కాంగ్రెసు అధిష్టానం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియా వంటి పెద్ద చేపలను ఎండగట్టడంలో ఆయన విజయం సాధించారు. ఎనలేని ప్రజాదరణతో వైయస్ జగన్ తన అధికార స్థాయిని నిలబెట్టుకున్నారు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రజాదరణ గల నాయకుడు వైయస్ జగనే. ఆయనను ఎవరూ అధిగమించలేరని ఉప ఎన్నికల ద్వారా రుజువైంది.
ఈ నెల 15వ తేదీ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత జాతీయ నాయకులు జగన్ వైపు బారులు తీరుతారు. ఆయనకు మద్దతుగా నిలుస్తారు. వేధింపు రాజకీయాలు కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు ఎదురు తిరుగుతాయి. తెలుగుదేశం, ఎల్లో మీడియాలతో కాంగ్రెసు కమ్మక్కు రాజకీయాలు దెబ్బ తింటాయి. పరస్పర సహకారం అందించుకున్నప్పటికీ వైయస్ జగన్ పార్టీని ఉప ఎన్నికల్లో నిలువరించలేకపోయాయని తేలిపోతుంది. రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆధిపత్యం సాధిస్తుంది.
వైయస్ జగన్ అరెస్టు తర్వాత వైయస్ విజయమ్మకు మద్దతుగా పెద్ద యెత్తున ప్రజలు ముందుకు వచ్చారు. జగన్ అరెస్టుకు నిరసనగా ఇచ్చిన బంద్ను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుల గృహ నిర్బంధం వంటి చర్యలతో విఫలం చేయడానికి ప్రయత్నించారు. జగన్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు సంయమనం పాటించారు. సాధారణ రాజకీయ నాయకులు జోకర్లుగా మారిపోయే విధంగా ప్రజలు మెచ్యూరిటీ చూపారు.
జగన్ ఆరెస్టుతో ఆయనకు మద్దతు 65 నుంచి 75 శాతం వరకు పెరిగిందని జాతీయ మీడియా సర్వేలు తెలిపాయి. కచ్చితంగా జగన్ సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నారనే మాట నిజమే. కానీ ప్రజల మద్దతుతో జగన్ తిరుగులేని నాయకుడిగా ముందుకు వస్తారు. అరెస్టుతో వైయస్ జగన్ పేరు జాతీయ స్థాయిలో మారుమోగింది. కాంగ్రెసును, సోనియా గాంధీని ఎదుర్కునే ఏకైక నాయకుడు వైయస్ జగన్ అనే పేరును సంపాదించుకుంటారు. అరెస్టుతో జగన్ హీరో అయ్యాడు.
జగన్ ఆధిపత్యానికి నాలుగు కారణాలు పనిచేశాయి - అవి 1. వైయస్సార్ 2. జగన్ కఠిన శ్రమ, నాయకత్వం 3. సాక్షి మీడియా 4. సోనియా, చంద్రబాబు, ఎల్లో మీడియా జగన్ను అణచివేయడానికి కుమ్మక్కైనట్లు ప్రజలు భావించడం. వైయస్ జగన్ మరింత బలంగా ముందుకు వస్తారు. జగన్ ప్రాముఖ్యాన్ని, జగన్ విజన్ను, నాయకత్వ నైపుణ్యాన్ని, ప్రజాదరణను, ఆకర్షణ శక్తిని జాతీయ నాయకులు గుర్తిస్తారు. భవిష్యత్తు కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో జగన్ కీలక పాత్ర పోషిస్తారని చెప్పవచ్చు.
గురువా రెడ్డి, అట్లాంటా