ఎన్టీఆర్ అబద్ధం చెప్పిన వేళ: ఏమైంది?
సినీ రంగంలోనే కాదు, రాజకీయాల్లోనూ ఎన్టీ రామారావుది సింహగర్జనే. రాజకీయాల్లో ఆయన కాంగ్రెసుపై తన ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో విరుచుకుపడుతుండేవారు. రాష్ట్రంలో మద్యపానానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఉద్యమం చేపట్టిన వేళ. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ అధికారంలో ఉండగా, ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఉంది. తెలుగుదేశం పార్టీ ఓటమితో ఎన్టీ రామారావు ప్రతిపక్ష నేత పాత్ర పోషించాల్సి వచ్చింది.
కాంగ్రెసును చిక్కుల్లో పడేయడానికి ఎన్టీ రామారావు సంపూర్ణ మద్యనిషేధం విధించాలంటూ ఉద్యమం చేపట్టారు. నెల్లూరు జిల్లాకు చెందిన రోషమ్మ అనే మహిళ అందుకు స్ఫూర్తిగా నిలిచారు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీకి, కాంగ్రెసు పార్టీకి మధ్య మాటల యుద్ధం సాగుతూ వచ్చింది.
అటువంటి యుద్ధ సమయంలోనే కాంగ్రెసు ఎన్టీ రామారావుపై ఓ ఆరోపణ చేసింది. ఎన్టీ రామారావు కుమారుడు నందమూరి హరికృష్ణ తన ఆహ్వానం హోటల్లో బార్ కోసం దరఖాస్తు చేసుకున్నారనేది ఆ ఆరోపణ. అయితే, ఎన్టీ రామారావు ముందూ వెనుకల చూసుకోకుండా తన కుమారుడు అటువంటి దరఖాస్తు చేసుకోలేదని చెప్పారు.
అప్పుడు ఉదయం దినపత్రికకు గజ్జెల మల్లారెడ్డి ఎడిటర్గా ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ అంటే అరికాలి మంట నెత్తికి ఎక్కేది. ప్రాథమికంగా ఆయన మార్క్సిస్టు. సిపిఐతో ఉండేవారు. కాంగ్రెసు పార్టీలోని కొంత మంది నాయకులతోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలుండేవి. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వార్తాకథనాలు రాయడానికి అదొక అవకాశంగా ఉండేది. అంతేకాదు, ఉదయం దినపత్రికలో విలేకర్లు స్వేచ్ఛగా వార్తలు రాసే వాతావరణం ఉండేది. యాజమాన్యం జోక్యం చాలా తక్కువగా ఉండేది.
అటువంటి స్థితిలో ఒక్క చిన్న పనితో ఎన్టీ రామారావును ఇరకాటంలో పెట్టే అవకాశం దక్కింది. రిపోర్టింగ్లో కొన్ని మెళుకవలు ఉంటాయి. ఎన్టీ రామారావును ఇరకాటంలో పెట్టడానికి అప్పటి మంత్రిని ఆశ్రయించి, హరికృష్ణ ఆహ్వానం హోటల్లో బార్ కోసం పెట్టుకున్న దరఖాస్తును సంపాదించాను. ఆహ్వానం హోటల్ హైదరాబాదులోని ఆబిడ్స్లో రామకృష్ణ జంట థియేటర్ల ఆవరణలోనే ఉంటుంది.
చంద్రబాబుతో విభేదించి, అన్న తెలుగుదేశం పార్టీని పెట్టినప్పుడు హరికృష్ణ ఆ హోటల్నే కేంద్రంగా చేసుకున్నారు. ఆయన అన్న తెలుగుదేశం పార్టీ పెట్టడానికి బావ దగ్గుబాటి వెంకటేశ్వర రావు, తదితరులతో పెద్ద కసరత్తే చేశారు.
అదలావుంటే, ఆ దరఖాస్తు ఆధారంగా వార్తాకథనం రాసి, దాని పక్కన హరికృష్ణ పెట్టుకున్న దరఖాస్తు కాపీని అచ్చు వేయడం జరిగింది. నిజానికి, ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా వార్తాకథనాలు రాయడానికి జంకే వాతావరణంలో ఉదయంలో మేం అలాంటి సాహసం చేశాం. మా వార్తాకథనం వల్ల ఎన్టీ రామారావు చిక్కుల్లో పడ్డారు. అప్పుడు రిపోర్టింగ్ అంటే అలా ఉండేది.. ఇప్పుడుందా... ఏమో....
- కాసుల ప్రతాపరెడ్డి