హక్కుల భాష్యకారుడు బాలగోపాల్

బాలగోపాల్ బౌద్ధిక ప్రపంచంలో నిమగ్నతకే ప్రాధాన్యం ఇచ్చారు. ఆచరణ, ఇంగిత జ్ఞానం, విస్తృత అధ్యయనాలతో సమాజానికి ఉపయోగపడే ఆలోచనలను ఆయన చేశారు. పౌరహక్కలకు ఊపిరినిచ్చారు. ఆయన బాహ్య ప్రపంచం దాడులకు, బెదిరింపులకు ఏనాడూ లొంగిపోలేదు. విప్లవోద్యమంలోని లోటు పాట్లను ప్రశ్నించినందుకు ఆయనపై దారి తప్పిన బాలగోపాల్ అంటూ, ఇతరత్రా విమర్శల దాడి జరిగింది. అయినా ఆయన చలించలేదు. సమాజాన్ని మార్చాలని, కనీస విలువల వైపు సమాజాన్ని నడిపించాలని ఆయన ప్రయత్నించారు. జీవితంలో ఆయన ఏ రోజు కూడా రాజీపడలేదు. అందుకే ఆయన పదునుగా కొత్త ఆలోచనలను ఆయన మన ముందుంచగలిగారు.
పౌర హక్కుల ఉద్యమ పరిధి ఆయనకు సరిపోలేదు. గిరిజనులు, తెలంగాణవాళ్లు, ముస్లింలు వంటి అభివృద్ధికి ఆవల ఉన్న సమూహాల కోసం పోరాడేందుకు అది పరిమితులు విధించిందని అనుకోవాలి. అందుకే ఆయన మానవ హక్కుల వేదికను స్థాపించారు. ఆయన రాసిన వ్యాసాలు, సంపాదకత్వం వహించిన గ్రంధాలు సమాజాన్ని నూతన దిశగా తీసుకుపోయేందుకు ఎంతగానే పనికి వస్తాయి. గణితంలో దిట్ట అయిన బాలగోపాల్ సమాజం లెక్కలను తీశారు. ఆయన రాసిన రూపం - సారం పుస్తకం తెలుగు సాహిత్య విమర్శకు ఒక నమూనాగా పనికి వస్తుంది. రూపవస్తు సమన్వయాల సాధన ఏ విధంగా ఉంటుందో ఆయన ఆ పుస్తకంలోని వ్యాసాల్లో నిరూపించారు. ఆయన మరణం తెలుగు సమాజానికి తీరని లోటు.












Click it and Unblock the Notifications