గమ్యం 'అనిల్' మర్డర్ మిస్టరీ
అనిల్ కాబోయే భార్య షాలినిని కలవడానికి వెళ్లి అకస్మాత్తుగా చనిపోవడం..షాలినీతో పాటు డాక్టర్లు కూడా సహజ మరణమేనని చెప్పడంతో అనీల్ కుటుంబసభ్యులకు అప్పుడు ఎలాంటి సందేహాలు కలగలేదు. అయితే షాలిని కుటుంబ సభ్యుల తీరుతో మృతుడి బంధువులకు అనుమానం వచ్చి కేసు పెట్టగా..తర్వాత పోస్ట్మార్టం నిర్వహించారు. తలకు బలమైన గాయం కావడంతోనే అనిల్ చనిపోయాడని అందులో తేలటం అందరినీ షాక్ కు గురి చేసింది.
అయితే మళ్లీ షాలిని తరఫు నుంచి అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు రీ పోస్ట్మార్టంకు ఏర్పాటు చేశారు. ఇందుకు అనిల్ కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేకపోయినా..అధికారుల తీరుపైనే పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తొలుత గాంధీ ఆస్పత్రి వైద్యులతో పోస్టుమార్టం చేయించగా..ఈసారి మాత్రం ఉస్మానియా డాక్టర్లను పిలిపించారు. దాంతో అనుమానాలు మరింతపెరిగాయి. ఉస్మానియా వైద్యులతో పాటు, తొలుత పోస్ట్మార్టం చేసిన డాక్టరు, థర్డ్పార్టీ నిపుణుల పర్యవేక్షణ ఉండాలని అనిల్ కుటుంబ సభ్యులు కోరినా పోలీసులు లెక్కలోకి తీసుకోలేదు.
షాలినీ కుటుంబ సభ్యులు..ఖాకీలపై ఒత్తిళ్లు తీసుకురావడంతో పాటు రాజకీయ పలుకుబడితో కేసును తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అనిల్ సోదరుడు ప్రకాష్ అనుమానం వ్యక్తం చేయటం అందరికీ పలు అనుమానాలుకు తావిస్తోంది. షాలిని సమీప బంధువు ఆంటోనిరెడ్డితో పాటు ఓ ఏసీపీ ఇందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు తమకు న్యాయం చేయాలని అనిల్ కుటుంబ సభ్యులు హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసారు.
మంత్రి ఈ విషయమై సానుకూలంగా స్పందించారని..అనిల్ తల్లి రజినారెడ్డి మీడియాకు తెలిపారు. ఏదైతేనేంరీపోస్ట్మార్టం రెండ్రోజుల పాటు వాయిదా పడింది. అనిల్ బంధువులు అందుబాటులో లేరంటూ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ ఈ కేసు ఎప్పటికి క్లైమాక్స్ కి వచ్చేను..బాధితులకు న్యాయం ఎలా జరిగేను అనేది ఇప్పుడు అందరి ముందు ఉన్న ప్రశ్న.