దీపావళి లక్ష్మీ పూజ...ఈ నెల 26వ తేదీనే.......!

మాత లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో చక్కటి శుభ్రత ఒకటి. శుభ్రంగా కళ కళ లాడే ఇంటిని ఆ మాత మొట్టమొదటే అడుగిడుతుందన్న నమ్మకంతో ప్రతి ఇల్లు ఈ రోజు ఎంతో శుభ్రతతో, వివిధ రకాల ముగ్గులతో, దీపాలతో, పూలతో అలంకరిస్తారు. శుభ్రతకు చిహ్నమైన చీపురు కట్టకు పసుపు, కుంకుమలు పెట్టి ఈ రోజున పూజిస్తారు. అమ్మవారు తాము పెట్టిన దీపాల వెంట రావాలని కోరుతూ సాయంత్రమయ్యే సరికి ప్రమిదల దీపాలు, లేదంటే, రంగురంగుల బల్బులు కల తోరణాలను ఇంటికి కట్టి అలంకరణలు చేస్తారు.
ఇక దీపావళి పూజ ఎలా చేస్తారు?
పూజలో ప్రధానంగా వినాయకుడిని, మాత లక్ష్మీ దేవిని పూజిస్తారు. ఏ పూజ చేసినా విఘ్నఅధిపతి అయిన వినాయకుడిని ముందుగా పూజించాలి. దీని తర్వాత లక్ష్మీ దేవిని ఆమె మూడు రూపాలయిన లక్ష్మీ, సరస్వతి, మహా కాళి, రూపాలలో పూజిస్తారు. వీరితో పాటు ధనాగారాలకు అధిపతి అయిన కుబేరుడిని కూడా పూజిస్తారు.
పూజకు ఏర్పాటు ఎలా వుండాలి?
కొద్దిపాటి ఎత్తుగా పీట వేయండి. లేదా ఇంటిలో వున్న టీ పాయ్ వంటివి కూడా బాగానే వుంటాయి. దానిపై తెల్లటి లేదా ఎరుపు రంగు కల కొత్త గుడ్డను పరవండి. ఆ కొత్త గుడ్డపై మధ్యలో బియ్యంగింజలు పోసి దానిపై అలంకరణ చేయబడిన కలశాన్ని(చెంబు) పెట్టండి. కలశంలో మూడు వంతుల నీరు, తమలపాకులు, మామిడి ఆకులు, పూలు, కొన్ని నాణేలు వేయాలి. కలశంపై వేరే గిన్నె పెట్టి దానిని బియ్యం గింజలతో నింపాలి. కలశంపై పసుపుతో పద్మం గుర్తు లేదా స్వస్తిక్ గుర్తు వంటివి గీయాలి. కలశంపై పెట్టిన బియ్యంకల గిన్నెలో లక్ష్మీ దేవి బొమ్మను, నాణేల సహితంగా వుంచాలి. కలశం ముందు కుడివైపుగా అంటే నైరుతి దిక్కుకు, గణేషుడి విగ్రహం వుండాలి. పిల్లల పెన్నులు, పుస్తకాలు లేదా మీ వ్యాపార చిట్టాలు మొదలైనవి కూడా ఈ విగ్రహాల ముందుంచాలి. విగ్రహాలకు పూలదండలు వేయండి.
దీపారాధన చేయండి, మంచి సువాసనల అగర్ బత్తీలను వెలిగించండి. ఇక దేవికి, గణేషుడికి, పూజ కొరకు పసుపు, కుంకుమ, పువ్వులను అక్కడే పెట్టండి. పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, తేనె అన్నీ కలిపి పంచామృతాలు తయారు చేయండి. కొబ్బరి కాయలు, పండ్లు, పంచామృతాలు, స్వీట్లు, ఇతర తిండి పదార్ధాలు పూజానంతరం లక్ష్మీ మాతకు నైవేద్యం పెట్టండి.
ముందుగా గణపతిని పూజించండి. తర్వాత లక్ష్మీ అష్టోత్తరం లేదా, సహస్రనామం మంత్రాలతో లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీ దేవి విగ్రహాన్ని ఒక పళ్ళెంలో పెట్టి నీరు, పంచామృతాలతో స్నానం చేయించండి. స్నానం చేయించే నీటిలో బంగారు వస్తువు లేదా ఒక ముత్యాన్ని వుంచాలి. స్నానం తర్వాత విగ్రహాన్ని శుభ్రం చేసి కలశంపై పెట్టండి. దేవికి గంధం, పసుపు, కుంకుమలు వేయండి. పూలదండ వేయండి. అప్పటికే సిద్ధంగా వుంచుకున్న కొబ్బరి చెక్లు, పండ్లు, స్వీట్లు మాతకు గణేషుడికి నైవేద్యం పెట్టండి.
తర్వాత, అక్కడ పెట్టిన పిల్లల పుస్తకాలు, లేదా వ్యాపార చిట్టాలు ని పూజించండి. వాటిలోని పేజీలపై పసుపుతో శ్రీ అని లేదా శుభ్ లాభ్ అని వ్రాయాలి. సవ్యమైన పద్ధతిలో స్వస్తిక్ గుర్తు రాయాలి.
ఇంటిలో చేసిన పిండివంటలు, తిండి పదార్ధాలను, మహా నైవేద్యంగా అమ్మవారికి పెట్టి దాని తర్వాత ' ఓం జై జగదీష్ హరే " లేదా ఇతర హారతి పాటలతో మాత లక్ష్మీ దేవికి హారతి పట్టండి.
చివరగా, ప్రసాదాన్ని అక్కడ వున్న కుటుంబ సభ్యులకు పెట్టి మీరు కూడా తీసుకోండి. ఇక ఇపుడు ఇంటి ప్రాకారంలో ఆకర్షణీయమైన ప్రమిదలతో నూనె దీపాలను లేదా కేండిల్స్ లేదా రంగుల బల్బులను వెలిగించి వెలుగులు విరజిమ్మండి. ఇంటిలోని లేదా ఇంటి ఆవరణలోని ఏ భాగమూ కూడా చీకటితో నిండరాదని గమనించండి. పూజకు ముందు దీపాలను వెలిగించరాదని కూడా గమనించండి.












Click it and Unblock the Notifications