అసీం త్రివేది ఇష్యూ: కార్టూన్తో గాంధీ రెస్పాన్స్
అసీం త్రివేది కార్టూన్ల తీరుపై తెలుగు కార్టూనిస్టులు ప్రతస్పందిస్తున్నారు. ఆయన కార్టూన్లను వ్యతిరేకిస్తూనే ఆయనను అరెస్టు చేయడంపై, ఆయనపై తీవ్రమైన కేసులు నమోదు చేయడాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. తెలుగు కార్టూనిస్టు గాంధీ తన కార్టూన్తో తన ప్రతిస్పందనను వ్యక్తం చేశారు. ఆ చిత్రాన్ని పైన చూడవచ్చు. అసీం త్రివేది కార్టూన్ల ప్రభావంపై, అవి రాజకీయ నాయకులపై చూపే ప్రభావంపై ఈ కార్టూన్ ద్వారా గాంధీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
"అసీం త్రివేది ప్రొఫెషనల్ కార్టూనిస్టు కాడు. యాక్టివిస్టు కార్టూనిస్టు. అసీం త్రివేది వేసిన కార్టూన్లు ఏ పత్రికలోనూ వేసుకోవడానికి కుదరవు. బ్యాడ్ టేస్టు కార్టూన్లు. వాటిని వేసుకోవడానికి ఏ పత్రికలో కూడా అచ్చు వేయడానికి కుదరదు. రాజద్రోహం అనే పదానికి అర్థం తెలుసుకోకుండా అసీం త్రీవేదిపై కేసు పెట్టారు. కార్టూన్సుకు ఆ కేసుకు సంబంధం లేదు. అతను ఒక్కడిని లొంగదీసుకోవడానికి ఆ కేసు పెట్టలేదు. మిగతావారిని భయపెట్టడానికి ఆ కేసు పెట్టారు" అని ది హిందూ దినపత్రిక కార్టూనిస్టు సురేంద్ర అన్నారు.
"కార్టూన్స్ వివాదాస్పదం అవడం, వాటి చుట్టూ రాజకీయాలు అల్లుకోవడం ఇటీవల పరిపాటి అయింది. పాఠ్యపుస్తకాల్లో అంబేద్కర్ కార్టూన్ చిత్రణ దగ్గరనుంచి ఇప్పటి అసీం త్రివేది రాజద్రోహ కార్టూన్ల వరకు జరుగుతున్న పరిణామాలు గమనిస్తే మనలాంటి ప్రజాస్వామ్య దేశంలో భావాలు ఎంత సున్నితంగా ఉంటాయో బోదపడుతుంది. ముఖ్యంగా అధికారవర్గం తనకు నచ్చని పనిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించదని, దానికోసం పౌరులకు ఉన్న ఏ హక్కునైనా కాల రాస్తుందని మరోసారి రుజువైంది" అని ఆంధ్రజ్యోతి దినపత్రిక కార్టూనిస్టు శేఖర్ అన్నారు.
"మనం స్పేచ్ఛా ప్రపంచంలో నివసిస్తున్నామా, నియంతృత్వంలో ఉన్నామా? మమతా బెనర్జీ కార్టూనిస్టును అరెస్టు చేయించారు, ఇప్పుడు ముంబై పోలీసులు మరో కార్టూనిస్టును అరెస్టు చేశారు. అసెంబ్లీలో పోర్న్ చూడడం నేరం కాదా? పార్లమెంటులో చేయి చేసుకోవడం నేరం కాదా? జాతీయ జెండాను గానీ జాతీయ చిహ్నాన్ని గానీ ఎవరు అవమానించకూడదు. ఆగ్రహానికి అది అభివ్యక్తి, అది అవమానించడం కాదు. కార్టూనిస్టు వ్యక్తీకరణకు ఎవరైనా బాధపడేవారు సిగ్గుపడాలి. వారి గురించి దేశం విచారం వ్యక్తం చేయాలి. అసీం త్రివేది ఓ కార్టూనిస్టు. కానీ రాజకీయ నాయకులు, అధికారులు కార్టూన్లకు మించిన క్యారెక్టర్లు" అని నమస్తే తెలంగాణ కార్టూనిస్టు మృత్యుంజయ ఆగ్రహం వ్యక్తం చేశారు.