ముఖేష్ సాంగ్స్తో..: జైల్లో కసబ్, నెలల్లో నేర్చాడు
కసబ్ ప్రవర్తన అనేక రకాలుగా మారుతుండేదట. జైలులో పెట్టిన కొత్తలోనే అక్కడి సిబ్బందిపై దాడి చేశాడు. అందుకే అతనికి కాస్త దూరంలో ఎప్పుడూ ఒక అధికారి ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇక జైలు ముద్ద అంటే అస్సలు గొంతు దిగకపోయేదట. కసబ్ పలుమార్లు తనకు పెట్టిన ఆహారాన్ని విసిరికొట్టి మటన్ బిర్యానీ కావాలని గోల చేసేవాడు. నన్ను ప్రేరేపించిన వారిని పట్టుకోవాలని, తనకు ఉరిశిక్ష వేసినంత మాత్రాన ఒరిగేదేమీ లేదన్నాడు.
భారతదేశ చట్టాలు తనను ఏమీ చేయలేవని, అంతర్జాతీయ కోర్టులో విచారించాలని, ఇక్కడి న్యాయస్థానాలలో న్యాయం జరగదని వ్యాఖ్యానించేవాడు. జడ్జిల ముందు కూడా పలుమార్లు మాటలు మార్చాడు. ముంబయి దాడిని సమర్థించుకున్నాడు. కసబ్ చురుకైన వాడు. ఎంత చురుకైన వాడంటే జైలులో కసబ్ తక్కువ సమయంలోనే మరాఠీ భాషను నేర్చేసుకున్నాడు. మూడేళ్ల క్రితం ముంబయి దాడుల కేసు విచారణ సందర్భంగా మరాఠీలో మాట్లాడి జడ్జితోపాటు కోర్టు హాల్లో ఉన్నవారందరినీ ఆశ్చర్యపోయేలా చేశాడు.
కింది కోర్టు విధించిన మరణశిక్షను ద్రువీకరించేందుకు హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనూ కసబ్ వికృతంగా ప్రవర్తించాడు. వీడియో కాన్షరెన్స్ ద్వారా విచారణ కొనసాగుతుండగా వెబ్ క్యామ్పై ఉమ్మేశాడు. తనను అమెరికా మానవ హక్కుల కోర్టుకు పంపాలని అరిచాడు.