ఫిబ్రవరిలో షెడ్యూల్, ఏప్రిల్లో సార్వత్రిక ఎన్నికలు!
ఏప్రిల్ మధ్య భాగంలో తొలి దశ ఎన్నికలు నిర్వహించి, మొత్తం ఐదు లేక ఆరు దశల్లో ఎన్నికలను పూర్తి చేసేందుకు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తోంది. గత లోక్సభ ఎన్నికలు 2009 ఏప్రిల్ 16 నుంచి మే 13 వరకూ మొత్తం ఐదు దశల్లో జరిగాయి. మే 16న ఫలితాలు ప్రకటించారు. ఆ ఎన్నికలకు మార్చి2న షెడ్యూల్ ప్రకటించారు.
వచ్చే లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలూ జరగనున్నాయి. హర్యానా ముందుస్తు ఎన్నికలకు వెళ్తుందని భావిస్తున్నా, ఆ దిశగా ఏ రాష్ట్రం నుంచీ తమకు ఇంత వరకూ విజ్ఞప్తి రాలేదని ఈసి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ఎన్నికల అధికారులు ఉధృతం చేశారు. ఈ నెల చివర్లో ఓటర్ల కొత్త జాబితాను విడుదల చేయనున్నారు.
2009 లోక్సభ ఎన్నికల్లో 71.4 కోట్లమంది ఓటర్లు ఉండగా, 2004 లోక్సభ ఎన్నికల్లో 67.1 కోట్లమంది ఓటర్లు ఉన్నారు. కాగా, ఎన్నికల ప్రకటన వెలువడడానికి ముందు కొత్త ప్రభుత్వం పార్లమెంటులో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి కొంత సమయం ఇవ్వడం కోసం 2014 ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరునెలల ఖర్చు కోసం ఓట్ ఆన్ అకౌంట్ ఆమోదానికి చివరిసారిగా లోక్సభ సమావేశం అవుతుంది.