కూతురు జాన్వి భవితవ్యంపై బెంగ.. నిబ్బరంగా ఉండటంతోనే అంతా!!
Recommended Video

ముంబై: దివికేగిన అఖిల భారత అభివన తార శ్రీదేవికి యాభై నాలుగేళ్లు. ప్రస్తుత జీవన ప్రమాణాల ప్రకారం చూస్తే అదేం పెద్ద వయస్సేం కాదు. ఆమె నిత్యం యోగా చేస్తారు. చురుగ్గా కనిపిస్తుంటారు. గుండె జబ్బు ఉన్నట్లు గత వైద్య పరీక్షల్లో ఎన్నడూ తేలలేదు. కానీ, హఠాత్తుగా గుండెపోటు వచ్చింది.
అందర్నీ హతాశుల్ని చేస్తూ శ్రీదేవి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో శ్రీదేవి మరణానికి దారి తీసిన కారణాలపై చర్చ దేశవ్యాప్తంగా మొదలైంది. తన భావోద్వేగాలను బయటపెట్టకుండా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిబ్బరంగా ఉన్నట్టు కనిపించడం ఆమెకు చిన్నప్పటి నుంచే అలవాటు.

క్లిష్ట పరిస్థితుల్లోనూ భావోద్వేగాలపై శ్రీదేవి నియంత్రణ
నాలుగైదు రాష్ట్రాలు, ఎన్నో భాషలు, అన్నేసి సంస్కృతులు, ఇంకెన్నో రకాల పరిస్థితులు, మరెన్నో వ్యక్తిత్వాలు ఆమెకు సుపరిచితమే. క్లిష్ట పరిస్థితుల్లోనూ సైతం భావోద్వేగాలను బయటికి పొక్కనీకుండా జాగ్రత్త పడేవారు. ఆ అలవాటే ఆమెను మానసికంగా ఒత్తిడికి గురి చేసి ఉంటుందని భావిస్తున్నారు. అందం మీద ఆరాటం, పిల్లల భవిష్యత్పై ఆందోళన, ఏ విషయాన్నీ బయటకు పొక్కనివ్వని మనస్తత్వం... ఇవన్నీ శ్రీదేవి జీవితానికి శాపంగా మారాయని అంచనా వేస్తున్నారు. 15 శాతం కార్డియాక్ అరెస్టులకు మానసిక ఒత్తిడి, కుంగుబాటులే కారణమని వైద్యులు చెబుతున్నారు.

తల్లి రాజేశ్వరి ఉన్నంత వరకు తల్లికొంగుచాటు కూతురే
శ్రీదేవి పర్ఫెక్ట్నెస్కు మరో పేరు. వయసుతో నిమిత్తం లేకుండా అందరికీ ఆమె అంటే ఇష్టం. ముక్కుపచ్చలారని ప్రాయంలోనే మెగాఫోన్ ముందు నిలుచున్నారు.. తోటి పిల్లలు మాతృభాషలో కూడా మాటలు నేర్వని ప్రాయంలోనే శ్రీదేవి పొరుగు భాషల్లోనూ మాట్లాడారు. బాలీవుడ్లో అడుగు పెట్టే వరకూ ప్రతీక్షణం ఆమె తల్లి రాజేశ్వరి వెన్నంటే ఉన్నారు. ఎక్కడ ఎలా ప్రవర్తించాలి? ఎవరితో ఎలా మాట్లాడాలి? పూసగుచ్చినట్టు నేర్పించారు. రాజేశ్వరి ఉన్నంత వరకూ శ్రీదేవి తల్లి కొంగుచాటు అమ్మాయే.

మనోభావాలు బయటపడొద్దని ఇలా
సినిమా అంటేనే గ్లామర్ ఫీల్డ్. మనిషి ముక్కు సూటిగా ఉండకూడదు. ముక్కు మాత్రం అందంగా ఉండాలి. మనసులో మాట పెదాలు దాటకూడదు. నవ్వు మాత్రం పెదాలమీద మరింత అందంగా తళుకులీనాలి. సినీ పరిశ్రమ నేర్పిన పాఠాలతోనే ఆమె ముక్కును ఆపరేషన్ ద్వారా తీర్చిదిద్దుకున్నారు. తర్వాత కూడా అందాన్ని ఇనుమడింపజేసే పలు శస్త్రచికిత్సలను చేయించుకున్నారు.

బోనీ కపూర్ తో ఇలా పెళ్లి.. పిల్లలకు ప్రాధాన్యం
బాలీవుడ్లో ‘హిమ్మత్వాలా'తో శ్రీదేవి పెద్ద హిట్ అందుకున్నారు. తర్వాత కూడా ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలు. అంతలోనే మిథున్ చక్రవర్తితో పెళ్లి వ్యవహారం.. తూచ్ అని అనడం, అప్పటికే పెళ్లయిన బోనీ కపూర్ని పెళ్లి చేసుకోవడం జరిగిపోయాయి. ఇద్దరు పిల్లల తల్లి అయిన తర్వాత కూడా శ్రీదేవి ఆహార్యానికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. ఎప్పుడూ మంచి ఛాయతో కనిపించాలని ఆరాటపడ్డారు.

రెండు సర్జరీల వల్లే మెరిసిందని గుసగుసలు
రీ ఎంట్రీ చిత్రం ‘ఇంగ్లిష్ వింగ్లి్ష'లో ఆమెను చూసిన వారంతా అవాక్కయ్యారు. ‘నిజంగానే అతిలోక సుందరి శ్రీదేవి' అని కితాబిచ్చారు. బాలీవుడ్ గుసగుసల ప్రకారం ఆ సినిమా కోసం శ్రీదేవి రెండు సర్జరీలు చేయించుకున్నారు. అందుకే ఆమె అంత బాగా తెరపై మెరిసిందనే వార్తలు వచ్చాయి.

పాత్ర కోసమేనని అతిలోక సుందరి దాటవేత
చివరి చిత్రం ‘మామ్'. అందులో దవడ ఎముకలు కనిపిస్తూ, కళ్లు లోపలికి పీక్కునిపోయి కనిపించిందామె. ‘పాత్ర డిమాండ్ మేరకే అలా కనిపించాను. ఆ పాత్రకు నున్నటి మేని మెరుపులు అవసరం లేదు' అని విలేకరులకు సమాధానమిచ్చారు. అందులో నిజం లేదన్నది ఒక వాదన. అంతకుముందు చేయించుకున్న సర్జరీ తాలూకు ప్రభావం తగ్గిపోయి అలా కనిపించిందని అంతా అన్నారు. దాంతో ఆమెలో ఒత్తిడి మొదలైంది. ‘నేను దేనికీ అంత తేలిగ్గా సంతృప్తి చెందను' అని శ్రీదేవి గతంలో ఓ సారి చెప్పిన మాటల్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి.

భోజనం చేయకుండా విటమిన్లపైనే ఆధారం
శ్రీదేవి అందం విషయంలో రాజీ పడలేదు. బరువు పెరగకూడదనే ఉద్దేశంతో భోజనం చేయకుండా విటమిన్ల మీద ఆధారపడి కూడా జీవించిందట. దానికి తోడు ఇటీవలే వెయిట్లాస్ సర్జరీ చేయించుకున్నట్టు కూడా మరో వార్త వినిపిస్తోంది. బాలీవుడ్ తారలతో అత్యంత సన్నిహితంగా మెలిగే పియాలీ గంగూలీ ఫేస్బుక్లో చేసిన పోస్టు ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. శ్రీదేవిపై బరువు తగ్గాలన్న ఒత్తిడి అధికంగా ఉందని తెలిపారు.

కాలిఫోర్నియాలో తరుచు క్లినిక్ల సందర్శన
ఈ వయస్సులో మడతలేని చర్మంతో నలభై ఏళ్ల లోపు మహిళలాగా కనబడాల్సిన ఒత్తిడి ఆమెను సర్జరీలకు పురిగొల్పిందని బాలీవుడ్ నటి పియాలీ గంగూలీ పేర్కొన్నారు. ఐదేళ్ల క్రితం తానామెను కలిసినపుడు ఎంతో అందంగా ఉన్నా ఆమెలో అంతులేని దిగులు తొంగి చూస్తోందని చెప్పారు. శ్రీదేవి తరచూ దక్షిణ కాలిఫోర్నియాలోని క్లీనిక్లను సందర్శించేదని చెప్పారు.

శివగామి మిస్తో మానసిక ఇబ్బంది
‘శ్రీదేవి సర్జరీలు చేయించుకుని బరువు తగ్గలేదు. తన కుమార్తె తొలి చిత్రం ఎలా ఉండబోతుందోననే ఒత్తిడి ఆమెలో ఎక్కువగా ఉంది. జాన్వి ఎలా చేస్తుందో.. ఎలా చేయగలుగుతుందో.. అనే టెన్షన్ శ్రీదేవిలో ఎక్కువగా ఉంది' అని బాలీవుడ్లో శ్రీదేవి సన్నిహితులు అంటున్నారు. ‘బాహుబలి' చిత్రంలో శివగామిగా నటించే అవకాశం తొలుత శ్రీదేవికే వచ్చింది. కానీ దాన్ని చేజేతులా జారవిడుచుకోవడం, ఆ చిత్రం పెద్ద హిట్ కావడం కూడా ఆమెను మానసికంగా కాస్త ఇబ్బందికి గురిచేశాయి. దానికితోడు ఎన్నో ఏళ్ల తర్వాత ఆమె తమిళంలో నటించిన ‘పులి' బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది.












Click it and Unblock the Notifications