ప్రత్యేకం: నాగోబా జాతర నేపథ్యం ఇదీ (ఫోటోలు)
హైదరాబాద్: ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర ఆదివారం అర్ధరాత్రి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ప్రారంభమైంది. మర్రిచెట్ల కింద బస చేసిన మెస్రం వంశీయులు, హస్తినమడుగు నుంచి తెచ్చిన పవిత్ర గంగాజలాలతో నేటి అర్ధరాత్రి నాగోబాకు అభిషేకం చేయడంతో గిరిజన జాతర ఘనంగా మొదలవుతుంది.
కేస్లాపూర్ ఆలయం పుష్యమి అమావాస్య నాడు ప్రత్యేక పూజలు ప్రారంభించారు. పవిత్ర గంగాజలాలతో కేస్లాపూర్లోని మర్రి చెట్టు విడిదికి బుధవారం చేరుకున్న మెస్రం గిరిజనులు ఆదివారం ఆలయానికి తరలివచ్చారు. సిరికొండ నుంచి తెచ్చిన కొత్త కుండలకు పూజారులు పూజలు నిర్వహించారు.
ఇప్పటికే తమ ఆరాధ్య దైవాన్ని దర్శించుకునేందుకు వేలాదిగా తరలివస్తున్న గిరిజనంతో అడవితల్లి పులకించిపోంది. దారిపొడవునా వెలిసిన దుకాణాలతో సందడి నెలకొంది. నాగోబా జాతర ఏటా పుష్యమాసం అమావాస్య రోజున ప్రారంభమై ఆరురోజుల పాటు కొనసాగుతుంది.

నాగోబా జాతరకు మెస్త్రం గిరిజనలు
దక్షిణ భారతదేశంలోని మెస్రం వంశ గిరిజనులకు అతి పెద్ద దేవుడు కెస్లాపూర్ నాగోబానే. వారిళ్లలో కొత్త కోడళ్లను నాగోబాకు పరిచయం (బేటింగ్) చేయడం వీరి ఆచారం. ఈ పూజలు చేసే వరకు ఆ కోడళ్లకు ఇంట్లో దేవుళ్లను కూడా మొక్కే అర్హత ఉండదు. ఈ మొక్కులు చెల్లించుకునేందుకు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, కర్ణాటక రాష్ర్టాలకు చెందిన మెస్రం వంశీయులంతా, తరలివస్తున్నారు.

నాగోబా జాతరకు మెస్త్రం గిరిజనలు
గోదావరి జలాలతో బుధవారం రాత్రి మర్రిచెట్ల కిందకు చేరుకున్న మెస్రం వంశీయులు, శనివారం రాత్రి దాకా అక్కడే బస చేశారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చనిపోయిన 78 మంది పెద్దలకు తూమ్ (కర్మకాండ) నిర్వహించారు. తర్వాత మర్రి చెట్లకు కొద్ది దూరంలో అర్ధరాత్రి పతిభగ్వన్ పూజలు చేశారు.

నాగోబా జాతరకు మెస్త్రం గిరిజనలు
సాముహికంగా వంటలు చేసి, సహపంక్తి భోజనాలు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన మెస్రం వంశీయుల పూర్తి వివరాలను మెస్రం పటేళ్లు సేకరించారు. కుల దేవతలు, నాగోబా పూజల గురించి వివరించారు. అనంతరం మెస్రం పటేళ్ల ఆధ్వర్యంలో జాతర నిర్వహణపై సమావేశమై, చర్చించారు.

నాగోబా జాతరకు మెస్త్రం గిరిజనలు
ఆలయ సమీపంలోని మర్రి చెట్ల వద్ద బస చేసిన మెస్రం వంశీయులు, మోదుగ చెట్టుపై భద్రపరిచిన గంగాజలంతో ఆదివారం గోవాడకు వెళ్తారు. అక్కడ 22 పొయ్యిలపై నైవేద్యాలను తయారు చేసి దేవుళ్లకు సమర్పిస్తారు. తర్వాత సిరికొండ నుంచి తెప్పించిన మట్టికుండలతో మర్రిచెట్ల సమీపంలోని బావి నీళ్ల కోసం బయలు దేరుతారు. మెస్రం వంశీయుల్లో 22 కీతలు ఉండగా, నిత్యం కీతల వారీగా బావికి పూజలు చేస్తారు.

నాగోబా జాతరకు మెస్త్రం గిరిజనలు
అక్కణ్నుంచి నీటిని తెచ్చి ఆలయంలో ఏడు పుట్టలు తయారు చేస్తారు. సాయంత్రం ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరుస్తారు. రాత్రి 10 గంటల తర్వాత సంప్రదాయ మహాపూజలు, గోదావరి జలాలతో నాగోబాకు అభిషేకం చేసి జాతర ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమలన్నీ మెస్రం వంశ పెద్దలు మాత్రమే చేస్తారు. సంప్రదాయ పూజల అనంతరం అతిథులుగా వచ్చే కలెక్టర్, ఐటీడీఏ పీవో ఇతర అధికారులను సన్మానించి, వారితో కూడా పూజలు చేయిస్తారు.

నాగోబా జాతరకు మెస్త్రం గిరిజనలు
ఆదివాసీ గిరిజన పండుగలను ఘనంగా నిర్వహిస్తున్న రాష్ట్ర సర్కారు, ఎప్పట్లాగే ఈసారి నాగోబా జాతరకు 10 లక్షలు ఇచ్చింది. దీనితోడు వివిధ శాఖల ద్వారా దాదాపు మరో 10 లక్షలు రాగా, జిల్లా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. 10న దర్బార్కు జిల్లామంత్రులతోపాటు ముఖ్య అధికారులు తరలిరానుండగా, పీవో ఆర్వీ కర్ణన్ సహా పలువురు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సుమారు 5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసి, ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ పరిసరాల్లో 6 లక్షలతో వివిధ అభివృద్ధి పనులు చేశారు.

నాగోబా జాతరకు మెస్త్రం గిరిజనలు
ఎస్పీ తరుణ్ జోషీ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక పోలీసు బలగాలను ఇప్పటికే రప్పించారు. ఐదుగురు సీఐలు, 20 మంది ఎస్ఐలు, 300 మంది ఇతర పోలీసులు బందోబస్తులో ఉన్నారు. రోడ్డుకిరువైపాలా బారికేడ్లు, ఆలయంలో కూలైన్లు ఏర్పాటు చేశారు.

ప్రత్యేక పూజలు: నాగోబా జాతర నేపథ్యం ఇదీ(ఫోటోలు)
మహాపూజల కోసం నాగోబా ఆలయాన్ని ముస్తాబు చేశారు. విద్యుద్దీపాలతో అలంకరించారు. శనివారం రాత్రికే భక్తులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. దుకాణాల ఏర్పాట్ల కోసం ఆలయ కమిటీ, రెవెన్యూశాఖ, ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్లాట్లకు ధరలు నిర్ణయించారు. శనివారం ఆలయానికి వెళ్లే రోడ్డుకిరువైపులా దుకాణాలు, హోటళ్లు ఏర్పాటయ్యాయి. రంగుల రాట్నాలు వెలిశాయి.

ఇదీ జాతర నేపథ్యం
క్రీ.శ 740 కెస్లాపూర్ గ్రామ గిరిజనుడు పడియేరు శేషసాయి నాగభక్తుడు. నాగదేవతను దర్శించుకునేందుకు నాగలోకానికి వెళ్లాడు. అక్కడ ద్వార పాలకులు అడ్డగించి నాగరాజు లేడని చెప్పడంతో శేషతల్పం తాకి వెనుదిరుగుతాడు. లోక సందర్శన ముగించుకుని చేరుకున్న ఆ నాగరాజు, శేషతల్పాన్ని మానవుడు తాకిన విషయం తెలుసుకుని ఆగ్రహిస్తాడు. శేషసాయిని అంతంమొందించాలని భావించి, భూలోకం వైపు వస్తాడు.

ఇదీ జాతర నేపథ్యం
ఇది తెలిసిన శేషసాయి ప్రాణభీతితో కాలజ్ఞాన పురోహితుడు ప్రధాన్ పడమార్ దగ్గరకు వెళ్తాడు. నాగరాజును శాంతింపజేసే మార్గాన్ని తెలుసుకుంటాడు. ఏడు కడవల ఆవుపాలు, పెరుగు, నెయ్యి, తేనె, బెల్లం, పెసరపప్పు తదితర ఏడు రకాలతో నైవేద్యంగా సమర్పిస్తాడు. హస్తినమడుగు నుంచి పవిత్ర జలాలను 125 గ్రామాల మీదుగా తెచ్చి నాగరాజును అభిషేకిస్తాడు. దీంతో ఆ నాగరాజు కెస్లాపూర్ వద్ద ఉన్న పుట్టలోకి వెళ్లి నివాసమేర్పరుచుకుంటాడు.

ఇదీ జాతర నేపథ్యం
అప్పటి నుంచి ఏటా పుష్యమాసం అమావాస్య రోజున అర్ధరాత్రి నాగోబాకు మహాపూజలు చేయడం మెస్రం వంశీయుల ఆనవాయితీ అయింది. మెస్రం వంశంలోని 22 తెగలు ఉండగా, ఇందులో మడావి, మర్సుకోల, పుర్క, మెస్రం, వెడ్మ, ఫంద్రా, ఉర్వేత తెగల వారు ఉంటారు. వీరంతా ఏడుగురు దేవతలను కొలుస్తారు.

ఇదీ జాతర నేపథ్యం
పుష్యమాసంలో వచ్చే పౌర్ణిమ రోజు మంది మెస్రం వంశీయులు హస్తిన మడుగులోని పవిత్ర గంగాజలాన్ని జారిలో(కళశంలో) తెచ్చేందుకు బయలు దేరుతారు. కాలినడకన 125 గ్రామాల మీదుగా ఆ గంగాజలాన్ని తెచ్చి, అమావాస్య రోజున నాగోబాను అభిషేకించి జాతర ప్రారంభిస్తారు. మర్రి చెట్ల వద్ద ఉన్న మోత్కాకు చెట్టుపై మూడు రోజులు భద్రంగా ఉంచుతారు. గంగాజలానికి వెళ్లే 25 రోజుల ముందు నుంచే నాగోబా పూజల ఏర్పాట్లలో నిమగ్నమవుతారు.












Click it and Unblock the Notifications