ఏపీకి అత్యాధునిక అసెంబ్లీ సిద్ధం: మైకులు విరిచే ఛాన్సే లేదు!
అమరావతి: నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ భవన నిర్మాణం వెలగపూడిలో ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంటోంది. గతంలో మైకులను విరిచేందుకు ఈ భవనంలో వీలులేకుండా చేయడం గమనార్హం. ప్రస్తుతం ఈ భవన నిర్మాణం చివరి దశకు చేరింది.
5వ తేదీ నాటికి పనులు 100శాతం పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. అంతేగాక, 10వ తేదీన జరిగే మహిళా పార్లమెంటేరియన్ సదస్సుతో పాటు ఏపీ అసెంబ్లీ భవనాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోడీని రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. అయితే, 5 రాష్ట్రాల ఎన్నికలు, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో సమయం కుదిరితేనే ప్రధాని వస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
అసెంబ్లీ భవన ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే..
ఈ సభా భవనంలో సభ్యుల స్థానాల వద్ద పాత పద్ధతిలో మైకులు ఉండవు. ఎందుకంటే.. రెవెల్యూటో సౌండ్ టెక్నాలజీని అమలు చేస్తున్నారు. సభ్యుడిని మాట్లాడేందుకు సభాపతి అనుమతిస్తే ఆ వెంటనే ఆయన ముందు ఉండే సెన్సర్ ద్వారా అతని స్వరం సౌండ్సిస్టమ్లోకి వెళుతుంది. ఇందుకోసం వారి స్థానాల్లో ప్రత్యేకంగా యంత్ర పరికరాలను ఏర్పాటు చేశారు.
ఓటింగ్ జరిగినా అందులోనే సభ్యుడు తన ఓటు హక్కు వినియోగించుకునే వ్యవస్థ ఇమిడి ఉంది. సభ్యులు మైకులు లాగేయడం, విరిచేయడం వంటి వాటికి అవకాశం లేదు. ఈ తరహా సౌండ్ సిస్టం లండన్ పార్లమెంటులో, ఆ తర్వాత కేరళ అసెంబ్లీలో ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఇందుకోసం మన రాష్ట్ర అధికారులు కేరళ వెళ్లి అక్కడ పరిశీలించి వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని శాసనసభ కంటే విశాలంగా ఈ భవనాన్ని తీర్చిదిద్దారు. మొత్తం 230మంది సభ్యులు కూర్చునేందుకు వీలుగా చర్యలు తీసుకున్నారు. ఈ సోఫాలను లేపాక్షి ద్వారా చేయించారు.
ఆరడుగులకుపైగా ఎత్తులో సభాపతి పోడియంను, ఆయన స్థానానికి ఎదురుగా పైభాగంలో అయిదు గ్యాలరీలను ఏర్పాటు చేశారు. వీటిని వీఐపీ, అధికారులు, సందర్శకులు, మీడియా కోసం కేటాయించారు. కాగా, ఫిబ్రవరి 20నుంచి అసెంబ్లీ కార్యదర్శి ఇక్కడే విధులు నిర్వహించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు స్వీకరించనున్నారు. మరో పక్క అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 1 నుంచి లేదా మొదటివారంలో ప్రారంభమవుతాయని చెబుతున్నారు.