అసలేం చేయాలి?: స్పీకర్ను చిక్కుల్లో పెట్టిన ఎర్రబెల్లి
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పలువురు కారు ఎక్కడం, స్వయంగా గతంలో ఫిర్యాదు చేసిన ఎర్రబెల్లి దయాకర రావు ఇప్పుడు పార్టీ ఫిరాయించిన నేపథ్యంలో.. చర్యల పైన స్పీకర్ మధుసూదనా చారి న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు.
తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా ఐదుగురు ఎమ్మెల్యేల పైన గతంలో ఎర్రబెల్లి దయాకర రావు టిడిపి శాసన సభా పక్ష నేతగా సభాపతికి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు అదే ఎర్రబెల్లి పార్టీ మారారు. అలా మారినవారందరూ కలిసి తమను టిఆర్ఎస్లో విలీనం చేయాలని లేఖ ఇస్తే ఏం చేయాలి?
వీరికి ఫిరాయింపుల చట్టం వర్తిస్తుందా? లేక 2/3 వంతు మందిని పార్టీ మారినట్లుగా గుర్తించి బులిటెన్ విడుదల చేస్తారా? తొలుత టిఆర్ఎస్లో చేరిన తలసాని చేసిన రాజీనామాను ఆమోదిస్తారా? టిఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల విషయంలో ఏం చేస్తారనే అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
తెలంగాణ శాసనసభ వ్యవహారాల శాఖలోనూ వీటిపైనే చర్చ జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా, సంక్లిష్టంగా పార్టీ ఫిరాయింపులు జరగడంతో ఏం చేయాలి? ఎలా వ్యవహరించాలన్నదానిపై తెలంగాణ స్పీకర్, శాసనసభ కార్యదర్శి నిపుణులతో చర్చిస్తున్నారు.
జాతీయ స్థాయిలోనూ నిపుణుల అభిప్రాయాలను తీసుకుంటున్నారు. ఇప్పటికే తెలంగాణ అడ్వొకేట్ జనరల్తో పలుమార్లు సమావేశమయ్యారు. గతంలో తలసాని, తీగల, తదితరులపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద చర్య తీసుకోవాలంటూ ఎర్రబెల్లి ఇచ్చిన లేఖపై ప్రధానంగా చర్చిస్తున్నారు.
గతంలో ఫిరాయింపులపై లేఖ ఇచ్చిన వ్యక్తే ఇప్పుడు విలీన లేఖ ఇచ్చారని, వీటిలో దేనికి ప్రామాణికత ఉంటుందన్నదానిపై స్పీకర్, శాసనసభ ఉన్నతాధికారులు.. నిపుణుల అభిప్రాయాలు, న్యాయ నిపుణులసలహాలు తీసుకుంటున్నారు. ఫిరాయింపులపై అన్ని పార్టీలు ఇచ్చిన ఫిర్యాదుల మీద ఒకేసారి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బడ్జెట్ సమావేశాల నాటికి దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.