వేడెక్కిన జగన్ రాజకీయం

రోశయ్యను సిఎల్పీ ఎన్నుకోలేదని, అందువల్ల రోశయ్య తాత్కాలిక ముఖ్యమంత్రి మాత్రమేనని, రోశయ్యను అధిష్ఠానం ఆదేశిస్తే బలపరుస్తానని, అయితే జగన్ ను ముఖ్యమంత్రిని చేయకపోతే రాజీనామా చేస్తానని మంత్రి కొండా సురేఖ పదే పదే అంటున్నారు. ఆమె తన గళాన్ని పెంచి రోశయ్యపై నిరసన గళం వినిపిస్తున్నారు. అదే మార్గంలో వరంగల్ జిల్లాకు చెందిన శాసనసభ్యుడు టి. రాజయ్య నడుస్తున్నారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేయకపోతే తానే కాదు, శాసనసభ్యులంతా రాజీనామా చేస్తారని ఆయన హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాలతో రోశయ్య తీవ్ర ఆగ్రహానికి గురైనట్లే కనిపిస్తున్నారు. గొడవలకు జగన్ ను బాధ్యుడ్ని చేయవద్దని అంటూనే తనతో పని చేసే వారు ఉంటే ఉండండి, లేదంటే వెళ్లిపొండని ఆయన స్వరం పెంచి మాట్లాడారు.
మూడు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల తర్వాత జగన్ ను ముఖ్యమంత్రిని చేయవచ్చుననే ఆయన వర్గీయుల ఆశలపై రోశయ్యతో పాటు కేశవరావు, హనుమంతరావు నీళ్లు చల్లడమే ప్రస్తుత వేడికి కారణమని భావిస్తున్నారు. కాగా, ఈ నెల ప్రారంభంలో జగన్ ఢిల్లీ వెళ్లి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియాను కలుస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఆయనకు సోనియా నుంచి పిలుపు రాలేదని తెలుస్తోంది. దీంతో ఈ నెల 5వ తేదీ వరకు ఆయన కర్నాటక రాజధాని బెంగుళూర్ లోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. బెంగుళూరులో ఆయనను వైయస్ ఆత్మీయ మిత్రుడు కెవిపి రామచందర్ రావు, మంత్రి ఎన్. రఘువీరా రెడ్డి కలిశారు. అధిష్ఠానం నుంచి వచ్చిన సీల్డ్ కవరును కెవిపి జగన్ కు అందజేసినట్లు చెబుతున్నారు. ఈ సీల్డ్ కవరులో ఏముందో తెలియడం లేదు. అయితే జగన్ ను ముఖ్యమంత్రి చేసే ఉద్దేశం మాత్రం అధిష్ఠానానికి ఆ లేఖ ద్వారా తెలిపినట్లు సమాచారం. దీంతో వైయస్ జగన్ వర్గీయులు రెచ్చిపోతున్నారు.
కడప జిల్లా పరిషత్ సమావేశాన్ని కాంగ్రెసు జడ్పీటిసి సభ్యులు మంగళవారం అడ్డుకున్నారు. వారికి మద్దతుగా కడప జిల్లా కాంగ్రెసు శాసనభ్యులు జడ్పీ సమావేశం వద్ద ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో ఎమ్మెల్సీ, జగన్ చిన్నాయన వైయస్ వివేకానంద రెడ్డి కూడా పాల్గొన్నారు. దీన్ని బట్టి తిరుగుబాటుకు జగన్ పావులు కదుపుతున్నట్లు భావిస్తున్నారు. జగన్ చేసిన ప్రకటన మాత్రం పార్టీ అధిష్ఠానం ఆదేశాలకు కట్టుబడి ఉండడానికి నిర్ణయించుకున్నట్లు సంకేతాలు ఇచ్చింది. అయితే పరిణామాలు మాత్రం జగన్ వర్గం వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. ఢిల్లీ వెళ్లిన కెవిపి రామచందర్ రావు పార్టీ అధిష్టానానికి చెందిన నాయకులను కలిసే అవకాశం ఉంది. అహ్మద్ పటేల్, వీరప్ప మొయిలీ, ప్రణబ్ ముఖర్జీలను ఆయన కలిసి పరిణామాలను వివరించే అవకాశం ఉంది. కాంగ్రెసు రాజకీయాలు మరింతగా వేడెక్కే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications