రాములమ్మకు మరో చాన్స్

విజయశాంతి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డిని కలిసి కాంగ్రెసులో చేరడానికి సిద్ధపడినట్లు వార్తలు వచ్చాయి. రాజశేఖర రెడ్డిని కలిసిన తర్వాత రాములమ్మపై తెరాస వర్గాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఆ తర్వాత జరిగిన కార్యవర్గ సమావేశంలో విజయశాంతిపై కెసిఆర్ తీవ్రంగా ప్రతిస్పందించారు. విజయశాంతిని తెలంగాణ ప్రజలు తరిమికొట్టాలని, ఆమెను గ్రామాల్లో పర్యటించకుండా అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే ఆ తర్వాత వైయస్ మరణించడం, రాష్ట్ర రాజకీయాల్లో మార్పు రావడం వంటి పరిణామాల వల్ల విజయశాంతి పునరాలోచనలో పడినట్లు వార్తలు వచ్చాయి.
ప్రస్తుత వాతావరణంలో విజయశాంతిని దూరం చేసుకోవడం మంచిది కాదనే అభిప్రాయానికి కెసిఆర్ వచ్చినట్లు చెబుతున్నారు. ఆమె తిరిగి తమ పార్టీలోకి వస్తే ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలని కూడా చెబుతున్నట్లు తెలుస్తోంది. రోజా మాత్రం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెసులో పనిచేయడానికి సిద్ధపడినప్పటికీ విజయశాంతి మాత్రం మౌనంగా ఉన్నారు. వైయస్ భౌతిక కాయాన్ని సందర్శించి ఆమె నివాళులర్పించారు. కానీ తన రాజకీయ భవిష్యత్తుపై ఆమె ఏమీ మాట్లాడడం లేదు. అందుకే ఆమె పట్ల ప్రస్తుతానికి మౌనం వహించడమే మంచిదని తెరాస వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications