తెలంగాణపై 'చిదంబరం'
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటన చేసిన మంత్రి పి. చిదంబరాన్ని ఆంధ్రప్రదేశ్ కోస్తాంధ్ర నాయకులు తిట్లతో దీవించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై మాట్లాడిన కేంద్ర హోం శాఖ కార్యదర్శి పిళ్లైపై కూడా దుమ్మెత్తి పోశారు. వాడెవడు, వీడెవడు అని మాట్లాడారు. రాష్ట్రాన్ని విభజించడమనండి, చూస్తాం అని కావూరి సాంబశివరావు లాంటి సీనియర్ నేతలు సంయమనం కోల్పోయి మాట్లాడారు. దాంతో చిదంబరం మాటేమో గానీ పిళ్లై తీవ్ర మనస్తాపానికి గురైనట్లు భావిస్తున్నారు. చిదంబరం మాత్రం ఏమీ మాట్లాడలేదు. ఆ ప్రకటనలతోనే చిదంబరానికి మాత్రమే కాకుండా కాంగ్రెసు అధిష్టానానికి చెందిన నాయకులకు కూడా కోస్తాంధ్ర నాయకుల ఆధిపత్య ధోరణి ఏమిటో అర్థమైనట్లు, రాష్ట్రాన్ని విభజిస్తే తప్ప తెలంగాణ ప్రజలకు నిష్కృతి లేదని, విభజన జరగకపోతే తెలంగాణలోనే కాకుండా కోస్తాంధ్రలోనూ కాంగ్రెసు తుడిచిపెట్టుకు పోతుందని కాంగ్రెసు అధిష్టానం భావించినట్లు తెలుస్తోంది. రాయలసీమలో వైయస్ జగన్ వల్ల పార్టీకి జరగబోయే నష్టాన్ని జెసి దివాకర్ రెడ్డి వంటి నాయకులను దగ్గర చేర్చుకోవడం ద్వారా పూరించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు వినికిడి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ద్వారా తెలంగాణలో ప్రాబల్యాన్ని కొనసాగించాలనేది వారి అభిప్రాయంగా కనిపిస్తోంది. అంతేకాకుండా, ఇప్పుడు విభజిస్తేనే రెండు ప్రాంతాల్లో కాంగ్రెసు ప్రభుత్వం ఏర్పడి వచ్చే ఎన్నికల నాటికి తగిన బలాలను కూడగట్టుకోవడానికి వీలవుతుందని భావిస్తున్నట్లు సమాచారం.
కాగా, పార్లమెంటు బడ్జెట్ సమావేశాల లోగా స్పష్టత రాకపోతే సమావేశాలను నడుపుకోవడం కూడా ఇబ్బందిగానే ఉంటుందని భావిస్తున్నారు. బడ్జెట్ సమావేశాలు సక్రమంగా జరగకపోతే ప్రభుత్వం స్తంభించిపోయే ప్రమాదం ఉంటుంది. దానివల్ల బడ్జెట్ ను ఆమోదించుకోవాలంటే పార్లమెంటు సమావేశాలు జరగాల్సి ఉంటుంది. అందుకు తెలంగాణ ఏర్పాటుకు స్పష్టంగా ముందుకు రావడం తప్ప కేంద్రానికి మార్గం లేదు. అందుకు అనుగుణంగానే చిదంబరం అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.