చిరంజీవి ఏక్ నిరంజన్

Chiranjeevi
చిరంజీవి తెలుగు సినిమాల ద్వారా తెలుగు ప్రజలకు ఎంత దగ్గరయ్యారో, రాజకీయాల ద్వారా అంత దూరమవుతున్నారు. ఆయన ఇమేజ్ క్రమక్రమంగా తరిగిపోతోంది. చిరంజీవి తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు, చేపడుతున్న కార్యక్రమాలు ఆయన అపరిపక్వతను సూచిస్తాయి. ఏకంగా ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసి రాజకీయాల్లోకి అడుగు పెట్టి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన ఆయన ప్రస్తుతం ఏదో విధంగా రాజకీయాల్లో ఇలా కాలం వెళ్లబుచ్చుదామనే ధోరణికి వచ్చినట్లు కనిపిస్తోంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల, అనాలోచితంగా వ్యవహరించడం వల్ల, అవగాహనా రాహిత్యం వల్ల ఆయన రాజకీయాల్లో దెబ్బ తిన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో ఘోర వైఫల్యం తర్వాత ఆయన వైఖరి మారుతుందని, పార్టీని బలోపేతం చేయడానికి నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తారని అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆయన మరింత పార్టీని నిర్వీర్యం చేసుకునే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. పార్టీలో ఆయన తప్ప మరెవరూ మిగలని పరిస్థితిని కల్పించుకుంటున్నారా అనే సందేహం కూడా వస్తోంది. ఆయన రాజకీయాలను సీరియస్ గా తీసుకోవడం లేదని, రాష్ట్రంలో తమ పార్టీ ఏదో ఒక రోజు అధికారంలోకి వస్తుందనే నమ్మకం కూడా ఆయనకు లేదని అంటున్నారు. తనకే నమ్మకం లేని చిరంజీవి తన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎలా నమ్మకం కలిగిస్తారనేది ప్రశ్న.

ఆయన వ్యవహార శైలి వల్ల తమ్ముళ్లు పవన్ కళ్యాణ్, నాగబాబు ప్రజారాజ్యం పార్టీకి దూరమయ్యారు. వారు చిరంజీవి రాజకీయాల గురించి గానీ ప్రజారాజ్యం గురించి గానీ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. తమ పనేదో తాము చేసుకుంటూ గమ్మున నోరు మూసుకున్నారు. ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటుకు పునాదులు ఏర్పాటు చేయడానికి నాగబాబు కాలికి బలపం కట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. అభిమానులను కూడగట్టి ఒక పార్టీ సైన్యాన్ని ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ప్రజాకర్షణ శక్తిగా మారి అన్నయ్య చిరంజీవిని ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నారు. కానీ వారి ఆశలు నీరు గారాయి. చిరంజీవి వ్యవహార శైలి అధికారాన్ని అందించే పరిస్థితి లేదని ఎన్నికల ప్రచారం సాగుతుండగానే వారు మెల్లగా తప్పుకున్నారు.

ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆయనకు వెన్నుదన్నుగా నిలిచి కొత్త సమీకరణాలతో రాష్ట్ర రాజకీయాలను నడిపిద్దామని ఆశించిన సీనియర్ నాయకులు అందరూ ఒక్కరొక్కరే గూడు వీడిపోయారు. చిరంజీవి చేత పార్టీ పెట్టించడానికి నానా యాతన పడిన హరిరామ జోగయ్య వంటి నాయకులు కూడా ఆశలు వదులుకున్నారు. పార్టీకి స్పష్టమైన రాజకీయ నిర్దేశాన్నిచ్చి, సైద్ధాంతిక ప్రాతిపదికను కల్పించి ప్రజలను దగ్గరచేసుకోవడానికి తెర వెనక రాత్రింబవళ్లు పనిచేసిన మిత్రా, ప్రభాకర్ వంటి నాయకులూ వెళ్లిపోయారు. ఇప్పుడు ఆయన వెంట కొద్ది మంది నాయకులు, పార్టీ శాసనసభ్యులు మాత్రమే ఉన్నారు. వారు కూడా చిరంజీవి మాటలను ఖాతరు చేసే పరిస్థితి లేదు. పార్టీ శాసనసభ్యులు చెప్పినట్లల్లా ఆయన నడుచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. లేదంటే వారంతా కట్టగట్టుకుని గోడ దూకే వాతావరణమే ఉంది. అందుకే ఆయన ఇద్దరు శాసనసభ్యులు మాత్రమే ఉన్న విశాలమైన తెలంగాణ ప్రాంతాన్ని వదులుకుని 16 మంది శాసనసభ్యులున్న సీమాంధ్ర ఎమ్మెల్యేల కోసం సమైక్య నినాదాన్ని అందుకున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్తానని ఆయన అంటున్నారు. దానికి ప్రాతిపదికనే లేదనే విషయాన్ని ఆయన గుర్తించడం లేదు. అలాంటప్పుడు ఆయన సమైక్యాంధ్ర ఉద్యమం ద్వారా సాధించేదేమీ లేదు. భవిష్యత్తులో ఆయన రెంటికి చెడ్డ రేవడి కావచ్చు. ఆయన ఒంటరిగా మిగిలిపోయే పరిస్థితి కూడా ఎంతో దూరంలో లేదని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+